గుంటూరు డాక్టర్ కార్తీక్కు స్టాన్ఫోర్ట్ యూనివర్శిటీలో జాబ్, వీసా లేకుండానే ఉద్యోగం
గుంటూరు డాక్టర్ మిక్కినేని కార్తీక్కు స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రోఫెసర్గా అవకాశం
గుంటూరు: అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో అధ్యాపకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ మిక్కినేని కార్తీక్కు అవకాశం దక్కింది.ఈ విశ్వవిద్యాలయంలో సీటు రావడమే అదృష్టం. అయితే ఏకంగా ఈ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించే అవకాశం దక్కడంతో దేశానికే గర్వకారణం.
ప్రపంచంలో పేరుపొందిన విశ్వవిద్యాలయాల్లో స్టాన్ఫోర్డు యూనివర్శిటీ ఒకటి. ఈ యూనివర్శిటీలో సీటు కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ యూనివర్శిటీలో సీటు దక్కడమంటేనే అదృష్టంగా భావిస్తారు.
ప్రపంచంలోనే వైద్యవిద్యకు ఎంతో ప్రఖ్యాతగాంచిన స్టాన్ఫోర్డు విశ్వవిద్యాలయం(స్టాన్ఫోర్డు మెడిసిన్)లో సహాయ ఆచార్యుడిగా పనిచేసే అదృష్టం గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి డాక్టర్ మిక్కినేని కార్తీక్కు దక్కింది.
గుంటూరు వైద్య కళాశాలలో 2004-10 మధ్య యూజీ పూర్తి చేసిన ఆ యువకుడు పీజీ,సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయటానికి 2012లో అమెరికా వెళ్లారు. 2012 నుంచి 2016 దాకా న్యూయార్క్లోని ఫిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో 'వాస్క్యూలర్ సర్జరీ' ఎండీ విద్యను పూర్తి చేశారు.
గుంటూరు వాసీ కార్తీక్కు అరుదైన అవకాశం
వైద్య విద్యలో ఎంతో అసమాన ప్రతిభ కనబరిచిన కార్తీక్కు 14 బంగారు పతకాలు వచ్చాయి. . వాసిక్యూలర్ డిపార్టుమెంట్లో మొత్తం 11 సీట్లు ఉంటే అమెరికాయేతర వ్యక్తిగా ఇతనికి మాత్రమే సీటు రాగా మిగిలిన పది మంది అమెరికా దేశానికి చెందినవారే. కార్తీక్కు ఈ సీటు దక్కడం ఇండియాకే గర్వకారణమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.‘వాస్క్యూలర్ సర్జరీ' సహాయ ఆచార్యుడిగా నియమిస్తూ వర్సిటీ అతనికి శుక్రవారం అధికారిక లేఖను పంపింది.
వీసా లేకుండానే అసిస్టెంట్ ప్రోఫెసర్ అవకాశం
అమెరికాలో ఎలాంటి వీసా లేకుండానే ఉండేందుకు వీలు కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం అతనికి మరో సువర్ణావకాశం కల్పించింది.. ప్రపంచంలో నోబెల్ బహుమతి గ్రహీతలు, అత్యంత అరుదైన వ్యక్తులకు(ఎక్స్టార్డినరీ వ్యక్తులు) మాత్రమే అమెరికా ప్రభుత్వం జారీ చేసే ‘ఓ-వన్ఏ' వీసాను స్టాన్పోర్టు వర్సిటీ సిఫార్సు మేరకు కార్తీక్కు జారీ చేసింది. స్టాన్ఫోర్డు వర్సిటీలో ఈ తరహా వీసాతో భారత సంతతికి చెందిన ఏ ఒక్కరూ పనిచేయలేదు.
చదువుతూనే పరిశోధనలు
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కార్తీక్ రెండు సార్లు ఇంటర్వ్యూకు హజరయ్యారు.యూనివర్శిటీ పాలకవర్గం సంతృప్తి చెందాకే కార్గీక్ను అసిస్టెంట్ ప్రోఫెసర్గా నియమించారు. . ఒకవైపు ఎండీ విద్యాభ్యాసం చేస్తూనే మరో వైపు చదువులో భాగంగానే పరిశోధనల వైపు దృష్టిసారించారు. హార్వర్డ్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అతని ప్రతిభను గుర్తించి రెండు రీసెర్చ్ ప్రాజెక్టులు మంజూరు చేశాయి. తప్పనిసరిగా ఆ పరిశోధనల ద్వారా వాస్క్యూలర్ సర్జరీలో విప్లవనాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతానని కార్తీక్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైద్యానికి అమెరికా ప్రాధాన్యత
వైద్యానికి అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గుండె, కిడ్నీ, మోకాలు శస్త్రచికిత్సల ద్వారా శరీరంలో ఎక్కడికక్కడ వాపులు వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న రంద్రాల ద్వారా ఆపరేషన్ చేసేలా తన పరిశోధనలు దోహదం చేస్తాయని కార్తీక్ చెప్పారు. అమెరికా మొత్తం మీద 3200 మంది మాత్రమే వాస్క్యూలర్ సర్జన్లు ఉండగా భారత్ లో అతి తక్కువ మంది డాక్టర్లున్నారు. స్టాన్పోర్డు వర్సిటీ సీనియర్ ఆచార్యులతో కలిసి పనిచేయటం వల్ల కొంత పరిణతి వస్తుందన్నారు కార్తీక్. అక్టోబరు 1న చేరాలని లేఖ పంపారని బాద్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు తప్పనిసరిగా పనిచేసేలా ఎంఓయూపై సంతకం చేసినట్లు వివరించారు. వార్షికంగా అన్ని రాయితీలతో కలిపి రూ.3.25 లక్షల డాలర్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు కార్తీక్.