సంచలనం సృష్టించిన గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో...పోలీసుల విచారణ వేగవంతం
గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించిన గుంటూరు-నర్సరావుపేట కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కిడ్నీ రాకెట్ లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యుల ప్రమేయం ఉండటం పెను ప్రకంపనలు రేపింది.
అయితే ఇంత సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసుల విచారణ నెమ్మదిగా సాగుతోందని విమర్శలు వినిపించాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించారు. విమర్శలకు తావు లేకుండా విచారణ చురుగ్గా సాగేలా కేసును సీసీఎస్కు లేదా సీఐడీకి బదిలీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నర్సరావుపేట పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిసింది.
ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించి పోలీసులు ఇప్పటికీ ఆరుగురు వ్యక్తులను విచారించినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నీ రాకెట్ కు సంబంధించి ప్రాథమిక ఆధారాలు వున్నాయని పేర్కొంటూ నిందితునిగా పట్టణానికి చెందిన తెలుగుదేశం నాయకుడు, రాష్ట్ర బంగారు వర్తక సంఘం నాయకుడు కపలవాయి విజయకుమార్ను చేర్చిన మొదటి పట్టణ పోలీసులు ఈనెల 8న ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. అనంతరం నర్సరావుపేట అక్కడే డ్రైవర్గా పని చేసిన వ్యక్తి, వెంకటేశ్వర్లు నాయక్, రాకెట్కు కీలక సూత్రధారిగా భావిస్తున్న తెనాలికి చెందిన ఓ మోటారు సైకిల్ మెకానిక్, డాక్యుమెంట్లు టైప్ చేసిన డీటీపీ సెంటర్ ఆపరేటర్, వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు వెల్లడికానున్నట్లు ప్రచారం జరుగుతోంది.