గుంటూరు:ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య...కలకలం
గుంటూరు:జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ రెండు హత్యలు గుంటూరు నగరానికి సమీపంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఒక ఘటనలో దుండగులు ఒక వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపగా, మరొకరిని గొంతుకోసి హత్య చేశారు. గుంటూరు నగర శివారులోని వెంగళాయపాలెంలో శివుడు నాయక్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఈ విధంగా బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చారు. మరోవైపు గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్లే మార్గంలోని ఫిరంగిపురంలో సీపూ అనే చిరువ్యాపారిని అగంతకులు గొంతుకోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే...
గుంటూరు మిర్చి యార్డ్ లో ముఠా కూలీగా పని చేసే శివుడు నాయక్ అనే వ్యక్తిని వెంగళాయపాలెంలో కొందరు దుండగులు బండరాళ్లతో మోది నాయక్ను హత్య చేశారు. అయితే శివుడు నాయక్ను ఒక మాజీ రౌడీషీటర్ పాత కక్ష్యత నేపథ్యంలో హత్య చేసివుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరోవైపు ఫిరంగిపురం రామాలయం వీధిలో పానీపూరి అమ్మకునే సీపూ అనే యువకుడిని అగంతకులు హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సీపూ అనే యువకుడిని గొంతు కోసి దారుణంగా హతమార్చారు. హతుడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం జోహాన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య అతడికి తెలిసినవారిపనే అయిఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.