చంద్రబాబుకు గర్నాథ్ రెడ్డి సెగ: జెసి జోష్, ప్రభాకర్ చౌదరి కినుక
Recommended Video
అనంతపురం: గుర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో అనంతపురం రాజకీయాలు మలుపు తిరిగే సూచలు కనిపిస్తున్నాయి. జిల్లా రాజకీయాలు అమరావతిలో కూడా వేడి పుట్టించిన విషయం తెలిసిందే.
గురువారంనాడు అమరావతిలో అసెంబ్లీ ఆవరణలో నేతలు మాట్లాడిన విషయాలు ఆ విషయాన్ని బయటపెడుతున్నాయి. గుర్నాథ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి గుర్రుగా ఉన్నారు.
గుర్నాథ్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా జెసికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయంతో ప్రభాకర చౌదరి ఉన్నారు. దాంతో గుర్నాథ్ రెడ్డి చేరిక కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారు.
ప్రభాకర్ చౌదరికి నచ్చజెప్పే ప్రయత్నం
గుర్నాథ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ప్రభాకర చౌదరి చంద్రబాబుకు చెప్పారు. పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా గుర్నాథ్ రెడ్డిని చేర్చుకోవడం అవసరమని చంద్రబాబు చెప్పారు. అయినా కూడా ప్రభాకర్ చౌదరి చల్లబడలేదు. దానికి తోడు గుర్నాథ్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కబ్జాలు, హత్యా రాజకీయాలు గుర్నాథరెడ్డి చరిత్ర అని ఆనయ విమర్శించారు.
గుర్నాథ్ రెడ్డి జెసి వర్గీయుడు కాబట్టే...
జేసీ దివాకర్రెడ్డి వర్గీయుడు కాబట్టే గుర్నాథ్ రెడ్డిని టిడిపిలో చేర్చుకుంటున్నారని ప్రభాకర్ చౌదరి అన్నారు. రూ.250 కోట్ల అక్రమాస్తులు సక్రమం చేసుకోవడానికే గుర్నాథ్ రెడ్డి పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల్లో జేసీ బ్రదర్స్ తప్ప మరెవరూ గుర్నాథరెడ్డికి మద్దతుగా నిలవలేదని కూడా అన్నారు. తానెప్పుడూ శాసనసభ సమావేశాలకు గైర్హాజరు కాలేదని, బుధవారం పరిస్థితుల కారణంగా తాను వెళ్లిపోయానని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారికి తగిన గుర్తింపు లభించడం లేదనే మాట కూడా అన్నారు.
బాబును దువ్విన జెసి
తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో సీటు రావడమనేది ముఖ్యమంత్రి చంద్రబాబు దయతోనే సాధ్యమవుతుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. టీడీపీలో ఒకరే బాస్ అన్నారు. అందరూ కలిసి చంద్రబాబు కింద పనిచేయాల్సిందేనని అన్నారు. ఇది ప్రభాకర చౌదరి విమర్శలను దృష్టిలో పెట్టుకుని అన్నట్లుగా భావిస్తున్నారు.
ఎవరైనా చంద్రబాబు కిందే..
గుర్నాథరెడ్డి అయినా, తానైనా చంద్రబాబు పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని జెసి దివాకర్ రెడ్డి పరోక్షంగా ప్రభాకర చౌదరికి కౌంటర్ ఇచ్చారు. పార్టీలో మరొకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతపురం రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నట్లు భావిస్తున్నారు.