‘రాజా ఆఫ్ కరప్షన్: జగన్ అవినీతి ఏపీ నుంచి యూపీకి పాకింది’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి ఏపీ నుంచి యూపీ వరకు పాకిందంటూ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
జాతీయ మీడియా తాజాగా బయటపెట్టిన ఆనందకుమార్ అవినీతి భాగోతం విషయంలో తీగ లాగితే డొంకంతా కదిలినిట్లు జగన్ అక్రమాలు వెలుగు చూశాయన్నారు. జగన్ సూట్ కేసు కంపెనీలైన డెల్టాన్, ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, భాస్కర్ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కంపెనీల అవినీతి భాగోతం మరోసారి బయటపడిందన్నారు.
టీడీపీ గతంలోనే ప్రచురించిన రాజా ఆఫ్ కరెప్షన్లో వీటిని ప్రస్తావించామన్నారు. ఆనంద్కుమార్ ఆస్తులు 2007లో రూ.7 కోట్లుగా ఉంటే 2014 నాటికి రూ.1,316 కోట్లకు చేరిందని జీవీ అన్నారు.
జగన్ఉపయోగించుకున్న సూట్కేసు కంపెనీలనే ఆనంద్కుమార్ కూడా వినియోగించుకున్నారన్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ గుర్తించడం లేదని అనుకున్నట్లుగా జగన్ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా దోచుకోవడం ఎవరికీ తెలియదనే భ్రమల్లో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు.
జగన్ రూ.10 షేర్లు రూ. 1,450కి అమ్మాడని, ఆనంద్కుమార్ కూడా ఇదే పద్దతిని అనుసరించాడని తెలిపారు. జగతి పబ్లికేషన్స్లో జగన్ పెట్టుబడి రూ.8 లక్షలేనని, మిగిలిన పెట్టుబడి దారుల వివరాలు వెల్లడించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.