ఐటీ రైడ్స్ ఇంకా జరగాలి: బాబుకు జీవీఎల్ షాక్, 'జగన్-విజయసాయి విదేశాలకు పారిపోయే యత్నం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు అవినీతితో సంపాదించిన సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్తో సమానమని బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

ఏపీలో ఐటీ దాడులు ఇంకా జరగాల్సి ఉంది
అవినీతి సొమ్మును అధికార పార్టీ నేతలు పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని జీవీఎల్ విమర్శించారు. అవినీతిపరుల బినామీ కంపెనీల పైనే ఐటీ దాడులు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు ఇంకా జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీ నేతలకు భయమెందుకు?
ఐటీ దాడులు జరిగిన కంపెనీల్లో అధికార పార్టీ నేతలు బోర్డు సభ్యులుగా లేనప్పుడు వారికి భయం ఎందుకో చెప్పాలని జీవీఎల్ నర్సంహా రావు నిలదీశారు. అవినీతి సొమ్ముతో నాయకులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించిన భవనాలు కడుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీకి ఒక్క రూపాయి ఇవ్వలేదు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణకు కేంద్రం రూ.450 కోట్లు ఇచ్చిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అన్నారు. అందుకే వెనుకబడిన జిల్లాలకు ఈ డబ్బులు ఇచ్చారని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు.

జగన్, విజయసాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నం
ఎన్నికలు పూర్తి కాగానే జగన్, విజయసాయి రెడ్డి సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని కనకమేడల అన్నారు. సోమవారం విజయసాయి రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి అన్నారు. దానికి రవీంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే విజయసాయి రెడ్డి జార్జియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రవీంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications