'పక్కా సమాచారంతో ఐటీ దాడులు, కంపెనీలపై ఆరోపణలు': బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇలా
అమరావతి: బినామీ ఆస్తులు బయటపెట్టే వారికి రూ.కోటి బహుమతి ఇస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 'బినామీ పట్టు.. కోటి పట్టు' అనేది ప్రజలు చేయాలని చెప్పారు. పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పారు. ఐటీ దాడులు కక్ష సాధింపు చర్య అనేది తప్పుడు మాటలు అని చెప్పారు.
బాబుపై ఏదో కుట్ర ప్రచారం: వాసిరెడ్డి, అజ్ఞాతంలోకి బీద మస్తానరావు? వైసీపీ రెబల్ సంస్థల్లో ఐటీ సోదాలు
చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు సమర్థించం
పన్ను ఎగవేతపై ఐటీ సోదాలను స్వాగతించాలని, సమావేశాలు పెట్టవద్దని జీవీఎల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన తీవ్ర వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదని చెప్పారు.
టీడీపీకీ చురకలు
అదే సమయంలో జీవీఎల్ నర్సింహా రావు తెలుగుదేశం పార్టీకి కూడా చురకలు అంటించారు. తాము చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించకపోయినప్పటికీ, టీడీపీ నేతలతో అదే చంద్రబాబు వేరే పార్టీలను తిట్టిస్తారని ఎద్దేవా చేశారు.
ఐటీ దాడులకు రాజకీయ రంగు
ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులకు తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగు పులుముతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. మావోయిస్టుల హత్యలకు కూడా రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. ఆదాయపన్ను శాఖ దాడులతో పెట్టుబడులు ఆగిపోతాయని చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు.
ఐటీ దాడులు జరిగిన కంపెనీలపై గతంలో ఆరోపణలు
ఏపీలో జరిగిన ఐటీ దాడుల్లో తమ పాత్ర లేదని మాధవ్ చెప్పారు. ఐటీ దాడులు జరుగుతున్న కంపెనీలపై గతంలో ఆరోపణలు వచ్చాయని చెప్పారు. కాగా, శుక్రవారం ఏపీలో 28 చోట్ల ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.