సగంమంది ఆశీర్వాదం, నేను అబద్దాలుచెప్తే సిఎం: జగన్
విజయవాడ: ఇక నుండి గ్రామ బాట పడతామని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దామని, మనలను సగం మంది జనం ఆశీర్వదించారని, అందుకే 67 స్థానాల్లో గెలుపొందామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చెప్పారు. కృష్ణా జిల్లా నియోజకవర్గాల సమీక్షలో జగన్ మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజలనే నమ్ముకుందని, మళ్లీ ప్రజల దగ్గరికే వెళ్తుందన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టిడిపి, ప్రతిపక్షమైన మనకు కేవలం ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే తేడా అన్నారు. మూడు లక్షలు ఓట్లు అటు ఇచి వస్తే వారే ప్రతిపక్షంలో ఉండే వారన్నారు.
టిడిపి గెలుపుకు ఒకటి మోడీ గాలి, రెండు చంద్రబాబు చెప్పిన అబద్దపు హామీలు అన్నారు. సాధ్యం కాదని తెలిసినా 88 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పారన్నారు. దానిని కాస్తో కూస్తో ప్రజలు నమ్మారన్నారు. అదే అబద్దాన్ని మనం కూడా చెబితే మూడు లక్షల ఓట్లో, అంతకంటే ఎక్కువ ఓట్లో మనకు పడేవన్నారు.
బహుశా అటువంటి అబద్దం చెప్పి ఉంటే తాను సిఎంగా ప్రమాణం చేసి ఉండేవాడినని అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రతి రైతు మనల్ని తిట్టుకునే వాడని, మూడు నెలల్లోనే మీరంతా తన దగ్గరకు వచ్చి ఉండవారని, సిఎం కావాలన్న కోరిక అందరిలోను ఉంటుందని, చంద్రబాబులోను ఉందని, మనలోను ఉంటుందని, కానీ అందుకోసం ఎన్ని అబద్దాలైనా ఆడడానికి, మోసం చేయడానికి బాబు వెనుకాడలేదన్నారు.
ఒకసారి సిఎం అయిన తర్వాత ముప్పై ఏళ్లపాటు ఎంత మంచి చేయాలి అంటే, తాను చేసిన మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు తన ఫోటో కూడా ఉండాలన్నారు. అబద్దాలు, మోసాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ముప్పై ఏళ్ల పరిపాలన చేయడం కాదు కదా.. ఐదు సంవత్సరాలకే జనం ఇంటికి పంపించేవారన్నారు. అబద్దాలు చెప్పే వారి ఫోటోలను ఎవరు ఇళ్లలో పెట్టుకోరని, అందుకే తాను అబద్దాలు చెప్పలేదని, నిజాయితీగా రాజకీయాలు చేశానని చెప్పారు.