అవమానంపై ఆగ్రహించిన హరిబాబు: చిన రాజప్ప క్షమాపణ
విశాఖపట్నం: సాధారణంగా సౌమ్యంగా కనిపించే బిజెపి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిబాబుకు ఆగ్రహం వచ్చింది. మంత్రుల తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన ఆయన అలిగి సభాస్థలి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన మంగళవారంనాడు విశాఖపట్నంలో చోటు చేసుకుంది. దాంతో మంత్రి గంటా శ్రీనివాస రావు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.
హరిబాబును బుజ్జగించేందుకు గంటా శ్రీనివాస రావు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా హరిబాబు కోపం తగ్గలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. విశాఖపట్నంలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి స్థానిక పార్లమెంటు సభ్యుడు హరిబాబును ఆహ్వానించారు. అయితే, ఆయనను వేదిక మీదికి ఆహ్వానించలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. స్థానికి పార్లమెంటు సభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన అక్కడే ఉన్న మత్రులను, ఉన్నతాధికారులను హరిబాబు ప్రశ్నించారు.
దాంతో కంగు తిన్న వారు వెంటనే ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఆయన ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం, బిజెపి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఘటన ఇరు పార్టీలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందనే ఆందోళన చోటు చేసుకుంది.
సీఎంఆర్ ఐకేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ఎంపీ హరిబాబును మంత్రులు, అధికారులు ఎవరూ పట్టించుకోకుండా అవమానించారన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. ఐ క్లినిక్ ప్రారంభానికి ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చిట్లు తమకు సమాచారం అందలేదని, తాము సరిగా చూసుకోలేదని, అందుకు క్షమాపణ చెబుతున్నానన్నారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హోం మంత్రి చినరాజప్ప హామీ ఇచ్చారు.