అస్తవ్యస్తం చేస్తే ఏపీకే నష్టం: హోదాకు మించి సాయమని హరిబాబు
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా పేరుతో అస్తవ్యస్త పరిస్థితులు సృష్టిస్తే రాష్ట్రానికే నష్టమని భారతీయ జనతా పార్టీ ఎంపీ హరిబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా ఉన్న పలు రాష్ట్రాలకు 2017తో వాటికి ఇచ్చిన గడువు పూర్తవుతుందని అన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. అంతేగాక, ప్రత్యేకహోదాను మించిన ప్రయోజనాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేంద్రం అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే పలు అంశాల్లో బాగా సాయం చేసిందన్న సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.
అన్ని ప్రయత్నామ్నాయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తుందన్నారు. బంద్లతో అస్తవ్యస్తమైన పరిస్థితులు కల్పిస్తే రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి దత్తాత్రేయతో సమావేశమైన ఆయన విశాఖ పోర్టులో ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.