హైదరాబాద్పై కవిత వ్యాఖ్యలపై హరిబాబు ఫైర్
చిత్తూరు: కాశ్మీర్, హైదరాబాద్ భారత దేశంలో అంతర్భాగం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు మండిపడ్డారు. ఇంతకంటే అసంబద్దమైన ప్రకటన మరొకటి ఉండబోదని ఆయన అన్నారు.కవిత వ్యాఖ్యలపై హరిబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తాను ఆ ప్రకటన చూడలేదని, కానీ అటువంటి ప్రకటన చేస్తే అంత కన్నా అన్యాయమైన ప్రకటన మరొకటి ఉండదని ఆయన అన్నారు. కాశ్మీర్ గానీ, హైదరాబాద్ గానీ ఈ దేశంలో అంతర్భాగం కాదని ఎవరైన ప్రకటన చేస్తే అంత అసంబద్దమైన ప్రకటన మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంగా వ్యాఖ్యలు చేశారో చూడనిదే వ్యాఖ్యలు చేయడం సబబుకాదని హరిబాబు అన్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరి ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ కుమార్ అన్నారు. కెసిఆర్ వైఖరి వల్ల 9.5 లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆదివారంనాడు అన్నారు.
ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాలని పునర్విభజన చట్టం ఆర్టికల్ 370డిలో అన్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు, విజయవాడ, పిడుగురాళ్లల్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications