మిత్రధర్మం కొనసాగాలనే..: ఎపికి సాయంపై హరిబాబు అవే మాటలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సాయంపై బిజెపి పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా చేయనంత సాయం మూడున్నరేళ్ల కాలంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చేసిందని చెప్పారు.
Recommended Video
కేంద్రం అందించిన సాయంపై ఎవరైనా పరిశోధన చేసి తెలుసుకోవచ్చునని ఆయన శుక్రవారం అన్నారు. మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించారని అంటున్నారని, ఆ రాష్ట్రాలకు చెందిన వివరాలను, ఆధారాలను తనకు ఇస్తే తాను కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతానని అన్నారు.
పరస్పర సహకారంతోనే ముందుకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని హరిబాబు అన్నారు. విజయవాడలో జరిగిన కృష్ణా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్రం ఇచ్చిన హామీలను, ఇవ్వని వాగ్దానాలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెసుపై హరిబాబు విమర్శలు...
అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులను కాంగ్రెసు చేయకుండా ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని హరిబాబు అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటికే ముంపు మండలాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, దానివల్ల పోలవరం పనుల్లో వేగం పెరిగిందని అన్నారు.
ఆ హక్కు కాంగ్రెసుకు లేదు..
పోలవరంపై మాట్లాడే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదని హరిబాబు అన్నారు. రాష్ట్రానికి చెందిన ఐదు అంశాలు మాత్రమే కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయని హరిబాబు చెప్పారు. దుగరాజపట్నం పోర్టు విషయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారంపై కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలపై రాష్ట్రంతో చర్చలు జరుపుతోందని చెప్పారు విశాఖ రైల్వే జోన్పై త్వరలోనే రాజకీయపరమైన నిర్ణయం వస్తుందని చెప్పారు.
కేంద్రం కట్టుబడి ఉంది
రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం కట్టుబడి ఉందని హరిబాబు చెప్పారు ప్రత్యేక హోదా వల్ల చేకూరే ప్రయోజనాల కన్నా ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు సమకూర్చే విషయంలో ఏ మాత్రం వెనుకడగు లేదని చెప్పారు.
మిత్రధర్మం కొనసాగాలనే అనుకుంటున్నాం...
తెలుగుదేశం పార్టీతో మిత్రధర్మం కొనసాగాలనే తాము అనుకుంటున్నట్లు హరిబాబు చెప్పారు. ఘర్ణణపూరిత వాతావరణానికి, ఆరోపణలకు, అనుమానాలకు చోటు లేకుండా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.