అందుకే నన్ను వెనక్కి నెట్టారు: హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం మాట్లాడుతాను కాబట్టే వెనక్కి నెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ: ఎన్టీఆర్ తనయుడు, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన తర్వాత ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తగిలాయని ఆయన అన్నారు. నిజాలు మాట్లాడడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. తెలుగు వాడికి ఒక గొప్ప గౌరవం తీసుకువచ్చిన నేత ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసించారు.

తాను రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు నిర్మాణానికి హరికృష్ణ నిధులు మంజూరు చేశారు. దీంతో రోడ్డు ప్రారంభించాల్సిందిగా గ్రామస్థులు ఆయనను ఆహ్వానించారు. వారి కోరికపై అక్కడకు చేరుకున్న హరికృష్ణకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎద్దుల బండిపై ఊరేగించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి హరికృష్ణ దూరమైన విషయం తెలిసిందే. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబుకు, నందమూరి హరికృష్ణలకు మధ్య ఎడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ తాజా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications