టిడిపి టి వ్యతిరేకి, బాబు డైరెక్షన్..కిరణ్ యాక్షన్: హరీష్
హైదరాబాద్: తెలంగాణను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు సోమవారం మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో కిరణ్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. బిల్లును తిప్పి పంపించాలని బాబు చెప్పగానే కిరణ్ వెనక్కి పంపాలని నోటీసు ఇవ్వడం కుమ్మక్కుకు నిదర్శనమన్నారు.
నీది చిత్తూరు... నాది చిత్తూరు అన్న తీరు కిరణ్, బాబుల తీరు ఉందన్నారు. నోటీసు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని కిరణ్ అవమానించారన్నారు. కిరణ్ నోటీసును సభాపతి తిరస్కరించాలని కోరారు. బిల్లును తిప్పి పంపడమంటే తెలంగాణను వద్దనడమే అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా నోటీసు ఇచ్చారన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా కిరణ్ నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు కిరణ్ నోటీసును వ్యతిరేకిస్తున్నారన్నారు.

సభాపతి రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని కోరారు. విభజన బిల్లుకు రూల్ 77 వర్తించదన్నారు. ముఖ్యమంత్రి నోటీసు ఏకపక్షమేనని చెప్పారు. తెలంగాణ బిల్లును తిప్పి పంపించాలని చంద్రబాబు చెప్పారని, తద్వారా టిడిపి తెలంగాణకు వ్యతిరేకమని గుర్తించాల్సి ఉందని చెప్పారు.
టిటిడిపి నేతల ఫైర్
తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటుకు వెళ్లకుండా ముఖ్యమంత్రి అడ్డుకునే కుట్ర చేస్తున్నారని టిటిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. కేబినెట్ నిర్ణయం లేకుండా ఇచ్చిన కిరణ్ నోటీసు చెల్లదన్నారు. ఏడున్నర గంటలు మాట్లాడాక నోటీసు ఇవ్వడం ఏమిటన్నారు. కిరణ్ ఏ హోదాలో నోటీసు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కిరణ్ నోటీసు ఇస్తుంటే టి మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నోటీసు వెనక్కి తీసుకునే వరకు సభను జరగనిచ్చేది లేదన్నారు.












Click it and Unblock the Notifications