సర్దుబాటు టీ వద్దు: హరీష్, చంద్రబాబుపై ఫైర్
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో సర్దుకుపోవాలని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అనడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి మృతిచెందిన డిసెంబర్ 3వ తేదీని అమరువీరుల దినోత్సవంగా పాటించేలా కొత్త రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడతామని వెల్లడించారు.
మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం జరిగిన సంపూర్ణ తెలంగాణ దీక్షా దివస్లో ఆయన పాల్గొన్నారు. "సర్దుకుపోవడమంటే ఏమిటి? తెలంగాణ చదువులను, ఉద్యోగాలను సీమాంద్రులకు అప్పజెప్పడమా? తెలంగాణ ఆదాయాన్ని పంచి ఇవ్వడమా? భద్రాచలాన్ని ఆంధ్రాకు ఇవ్వడమా?'' అని ఆయన తెలంగాణ కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు.

పదవుల కోసం, సోనియాగాంధీ మెప్పు కోసం, సూట్కేసుల కోసం కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సర్దుబాటు తెలంగాణ వద్దని, హైదరాబాద్, భద్రాచలంతో కూడిన సంపూర్ణ తెలంగాణే కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి వివిధ పద్ధతుల్లో ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఇప్పుడు తెలంగాణ జైత్రయాత్రలు నిర్వహిస్తుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.
కాంగ్రెసు నాయకులు ఏం ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారని ఆయన అడిగారు. చేసిన పాపాలు పోవాలంటే వారు జైత్రయాత్రలు కాదు, సంపూర్ణ తీర్థయాత్రలు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అవుదామని ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ నాయకులు సఫారి సూట్లు కుట్టించుకున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు వ్యతిరేకంగా కొబ్బరికాయ సిద్ధాంతం, రెండు కళ్లు , ఇద్దరి కొడుకుల సిద్ధాంతాన్ని వల్లె వేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంప్రదాయం ప్రకారం విభజన చేయాలని కోరడం హాస్యాస్పదమని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ దీక్ష చేసిన రంగధాంపల్లి శిబిర స్థలాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతామన్నారు. సిద్దిపేటలోని దీక్షా శిబిరం వద్ద పైలాన్ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications