టీటీడీ నుండి 241 కోట్లు రావాలి: హరీష్, రసమయి పాట
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెలంగాణ దేవాదాయశాఖకు రూ.241 కోట్లు రావాలని మంత్రి హరీష్ రావు బుధవారం శాసన సభలో చెప్పారు. దేవాదాయ శాఖకు టీటీడీ బకాయి పడిందని, విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన తెలంగాణకు డబ్బు పంచాలని చెప్పారు. దీని కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయంలో.. దేవాదాయశాఖకు నిధుల మంజూరు అంశంపై చర్చ సందర్భంగా హరీష్ సమాధానమిచ్చారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఎక్కడా లోటు రాకుండా చూస్తున్నామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించామన్నారు.
రసమయి పాట

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు కూడా అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిద్దామని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు పిలుపునిచ్చారు. అయితే అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందన్న ఆయన ఆరోపణలపై శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అమరుల త్యాగాలపై మాట్లాడిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కవితలు, పాటలను వినిపించారు. అమరుల త్యాగాలను కొనియాడుతూ ఆయన పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అమరులను సమరయోధులుగా గుర్తించాలని జీవన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications