చంద్రబాబుది శాడిజం, మందబలంతో..: హరీష్ రావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది శాడిజమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్లో మందబలంతో పోలవరం ముంపు గ్రామాలను కలిపేసుకుంటూ బిల్లును ఆమోదించుకున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్ 10 గంటల పాటు చర్చించారు. అనంతరం సచివాలయంలో రాత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణను ముంచాలన్న తెలుగుదేశం వైఖరిపై ఆ పార్టీ టిడిపి నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇంకా తెలంగాణ నేతలు టిడిపిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. తక్షణమే పార్టీని వీడాలని కోరారు. బడ్జెట్లో తెలంగాణకు బిజెపి అన్యాయం చేసిందని, నిమ్స్ను ఎయిమ్స్ స్థాయికి మార్చాలనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదని, గిరిజన, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు విషయం పట్టించుకోలేదని అన్నారు.
కాకినాడ డెవలప్మెంట్ బోర్డుపై ఉన్న ప్రేమ సిరిసిల్ల చేనేత కార్మికులపై చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల స్థూపానికి కూడా రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్టర్ల కోణంలోనే డిజైన్ చేశారని, ఇకపై రైతాంగానికి నీరందించే కోణంలోనే ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయని మంత్రి ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారని వెల్లడించారు. మహబూబ్నగర్లో బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడులకు ఉన్న అడ్డంకులను తొలగించి ప్రాజెక్టులు పూర్తి చేసి ఐదులక్షల ఎకరాలకు నీరందిస్తామని వెల్లడించారు.
నల్గొండలో ఎస్ఎల్బీసీ, వరంగల్లో దేవాదుల ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ప్రకటించారు. చిన్న నీటిపారుదల రంగానికి పెద్దఎత్తున ప్రాధాన్యం ఇస్తామని, చెరువులన్నింటికీ మరమ్మతు చేయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుల్లో పూడికతీతకు ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగిస్తామన్నారు.