దేనికైనా రెడీ అని హర్ష, డిగ్గీపై అశోక్: టిడిపి ప్లకార్డ్ గొడవ
ప్రజల ఆకాంక్ష మేరకే అవిశ్వాసమని, ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో టి బిల్లును ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఉమ్మడి రాజధాని రాజ్యాంగంలో లేదని, హైదరాబాదును యూటి చేయాల్సిందేనన్నారు. కిరణ్ శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పాలిస్తున్నారని కితాబిచ్చారు. నాలుగు రోజుల క్రితం సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో సభ గందరగోళంతో వాయిదాలు పడుతున్న విషయం తెలిసిందే.
మళ్లీ సమ్మె: అశోక్ బాబు
తాము అవసరమైతే మరోసారి సమ్మెకు సిద్దమని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. విజయవాడలో జరిగిన న్యాయవాదుల సమైక్య శంఖారావం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాము వెంటనే ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఉద్యమం ఆఖరి ఓవర్ లాంటిదన్నారు.
ఇంకా రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలకు బుద్ధి చెప్పేలా సాంఘిక బహిష్కరణ చేపడతామన్నారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు రాదనే ఎపి కాంగ్రెసు వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు వచ్చారన్నారు. సమైక్య రాష్ట్ర పోరాటంలో కాంగ్రెసు నేతలు ఉన్నారన్న విషయం ఆయన గుర్తించాలని హితవు పలికారు. ప్రజల ఉద్యమం ముందు ఢిల్లీ పెద్దల పాచికలు పారవన్నారు. పొలిటికల్ మేనేజ్మెంట్ కోసమే డిగ్గీ పర్యటన అన్నారు. నేతలు ఆయన ఒత్తిడికి లొంగవద్దని, సీమాంధ్ర ప్రజలు అమాయకులు కాదన్నారు.
సీమాంధ్ర టిడిపి వర్సెస్ టిటిడిపి
టిడిఎల్పీ కార్యాలయంలో తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య ప్లకార్డులపై వాగ్వాదం జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకోవడమేమిటని టిటిడిపి నేతలు ప్రశ్నించారు. మీరు కూడా తెలంగాణ ప్లకార్డులు పట్టుకున్నారు కదా అని సీమాంధ్ర నేతలు ప్రశ్నించారు. దీంతో ఇరుప్రాంతాల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.