PMO నుంచి సందేశం... మోడీ విజన్ కు చంద్రబాబు?
విజన్ 2040 రూపకల్పన చేయడానికి ప్రధానమంత్రి మోడీ నిష్ణాతులను నియమించారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజన్ - 2040 దిశగా అడుగులు వేస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి నిపుణులతోపాటు విజన్ ఉన్న రాజకీయ నేతల సలహాలు, సూచనలు తీసుకోబో
ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజన్ - 2040 దిశగా అడుగులు వేస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి నిపుణులతోపాటు విజన్ ఉన్న రాజకీయ నేతల సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. ఒక విజన్ రూపొందించడం, దానిప్రకారం అభివృద్ధికి బాటలు వేయడం విజనరీ ఉన్న రాజకీయ నేతలు చేసేపని. దూరదృష్టితోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా వీరి విజన్ ఉంటుంది.
విజన్ ఉన్న నేతలుగా గుర్తింపు
విజన్ ఉన్న నేతలుగా చంద్రబాబునాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్లు వినిపించేవి. ప్రస్తుతం నరేంద్రమోడీ సాంకేతికత, ఆర్థిక రంగం, వ్యవసాయం, తదితర రంగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి విజన్ -2040 రూపకల్పన చేయడానికి మోడీ నిష్ణాతులను నియమించారు.
అలాగే ఈ విజన్ కు అవసరమైన ఇన్ పుట్స్ ఇవ్వడానికి దేశంలోని కొందరు రాజకీయ నేతలపేర్లను ప్రధానమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల నుంచి చంద్రబాబుకు సందేశం వచ్చినట్లు పార్టీ కార్యాలయవర్గాలు వెల్లడించాయి.
బాబు రూపొందించిన 2020
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ - 2020 రూపొందించారు. 1999 నుంచి ఆయన ఆ దిశగానే అడుగులు వేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ కూడా అదే విజన్ ను కొనసాగించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి దాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిలపడానికి చంద్రబాబు విజన్ రూపొందించారు.
వాణిజ్య కేంద్రంగా వైజాగ్
ఆధ్యాత్మిక హబ్ గా తిరుపతి, హార్డ్ వేర్ హబ్ గా రాయలసీమ, వాణిజ్య కేంద్రంగా విశాఖ, కోస్టల్ కారిడార్ ఏర్పాటుతో కోస్తాను అభివృద్ధి చేసేలా విజన్ రూపొందించారు. దీనికోసం విజన్ - 2029 రూపొందించారు. ప్రపంచంలో ఏపీని మొదటిస్థానంలో నిలిపేందుకు విజన్ - 2050 తయారు చేయించి దాన్ని అమలు చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాలు చేసుకున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. దీంతో ఆయన రూపొందించిన విజన్స్ 2029, 2050 కాలగర్భంలో కలిసిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందించబోతున్న విజన్ - 2040కి బాబు సూచనలను పరిగణనలోకి తీసుకోబోతున్నారు.