నిర్మల సీతారామన్పై డైలమా: వాళ్లడగలేదని చంద్రబాబు ఝలక్
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల విషయమై బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు చెప్పారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు టిడిపి - బీజేపీ మిత్రపక్షం, ఒకటి వైసిపి గెలుచుకునే అవకాశముంది.
రాజ్యసభ: నిర్మలకు టిడిపి ఛాన్స్!, ఏపీకి కేంద్రమంత్రులు.. వెంకయ్య లేకుండా
దోస్తీలో భాగంగా టిడిపి రెండు, బీజేపీకి చంద్రబాబు ఓ స్థానం కేటాయించనున్నారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఏపీ నుంచి నిర్మలా సీతారామన్ను మరోసారి బీజేపీ తరఫున రాజ్యసభకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదనలు వినిపించాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ విషయంలో ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.
తమకు ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వారు అడిగితే ఓ స్థానాన్ని ఇచ్చే విషయమై పరిశీలిస్తామని చెప్పారు. వారు తమ ముందు ప్రతిపాదన పెట్టాక దాని గురించి ఆలోచిద్దామని అభిప్రాయపడ్డారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టిడిపి మూడు స్థానాలు గెలుచుకోగలదు. ఇందులో ఓ సీటు సుజనా చౌదరికి ఇప్పటికే కేటాయించారని తెలుస్తోంది. మరో ఇద్దరి పేరు కూడా చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కోరితే నిర్మలకు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే, ఇటీవల ప్రత్యేక హోదా, ఏపీకి కేంద్రం నిధుల విషయంలో టిడిపి - బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కోరినా చంద్రబాబు సీటు ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్న చంద్రబాబు ఓ సీటు బీజేపీకి వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఆసక్తికర విషయమేమంటే ఓ సీటును కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడుకు ఇవ్వాలని తొలుత టిడిపి భావించింది. కానీ ఆయన కర్నాటక నుంచే రెండోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. అంతేకాదు, స్వయంగా వెంకయ్య కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తితో లేరు.
దీంతో నిర్మలకు అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. తమంతట తాము బీజేపీకి ఇచ్చేది లేదని, ఆ పార్టీ కోరితే తాము ఆలోచిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ.. రాజ్యసభ అంశాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఒక రాజ్యసభ సీటు గురించి టీడీపీని అడగాలా వద్దా అనే విషయమై అధిష్టానానికే వదిలేశామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) గౌహతి వెళ్తున్నారు. అసోంలో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. శరబానంద సోనోవాల్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి హాజరవుతున్నారు. చంద్రబాబును బీజేపీ అధినేత అమిత్ షా ఆహ్వానించారు. ఈ సమయంలో రాజ్యసభ అంశం చర్చకు వచ్చే అవకాశముందని అంటున్నారు.