జగన్ సర్కార్ పై హైకోర్టు ఫైర్- కోర్టుకు నలుగురు ఐఏఎస్ లు-స్కూళ్లలో ఆ భవనాలపై
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అనధికార నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో కోర్టు ధిక్కారం కింద నలుగురు ఐఏఎస్ అధికారుల్ని హైకోర్టుకు పిలిపించింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణంపై హైకోర్టు ధిక్కార కేసు విచారణ చేపట్టింది. ఈ కేసులో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పేద పిల్లలు చదువుకునే స్కూల్లో వాతావరణం కలుషితం చేస్తున్నారు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ఇంకా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. పాఠశాల ఆవరణలోకి రాజకీయాలు తీసుకొస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications