నిమ్మగడ్డకు హైకోర్టులో డబుల్ షాక్- నామినేషన్ల స్వీకరణకు బ్రేక్- వాలంటీర్ల ఫోన్లకు ఓకే
ఏపీ హైకోర్టులో ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న రెండు కీలక నిర్ణయాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేయలేని వారిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ నిర్ణయాలను హైకోర్టు పక్కనబెట్టింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు ఆదేశాలూ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వానికీ భారీ ఊరటనిచ్చేలా ఉన్నాయి.
Recommended Video

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు వేయలేని వరికి మరోసారి అవకాశం కల్పించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో అదికార పార్టీ బలవంతంగా ఉపసంహరింపజేసిన నామినేషన్లను ఎస్ఈసీ తీరిగి అనుమతించడం సమస్యలు సృష్టిస్తోంది. దీంతో వైసీపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నామినేషన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన మరో పిటిషన్పైనా హైకోర్ట కీలక నిర్ణయం ప్రకటించింది.

నామినేషన్ల స్వీకరణ చెల్లదన్న హైకోర్టు
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్లు దాఖలు చేయలేని వారు, బలవంతంగా ఉపసంహరణలు జరిగిన చోట్ల అభ్యర్ధులకు మరో అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఎస్ఈసీ విశేషాధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. కానీ దీన్ని హైకోర్టులో కొందరు సవాల్ చేశారు. కేసు విచారణ జరిపిన హైకోర్టు నామినేషన్ల స్వీకరణ కుదరదంటూ ఆదేశాలు ఇచ్చింది.
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆరుగురు, పుంగనూరులో ముగ్గురు, కడప జిల్లా రాయచోటిలో ఇద్దరిని తిరిగి నామినేషన్ వేసుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అవకాశం కల్పించారు. అయితే ఈ ఆదేశాలను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లు వేసేందుకు అనుమతించొద్దని తీర్పులోపేర్కొంది.

వాలంటీర్ల ఫోన్ల స్వాధీనంపైనా షాక్
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు తమ మొబైల్ ఫోన్లతో వైసీపీ అభ్యర్ధులకు సహకరిస్తున్నారంటూ ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ వాలంటీర్లు తమ ఫోన్లను ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హైకోర్టులో వాదించింది. దీంతో హైకోర్టు ప్రభుత్వ వాదనపై సానుకూలంగా స్పందించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ సర్కారుకు భారీ ఊరట
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఉపసంహరించిన నామినేషన్లకు తిరిగి అనుమతించే విషయంతో పాటు వాలంటీర్ల ఫోన్ల స్వాధీనం విషయంలోనూ హైకోర్టు ఆదేశాలు వైసీపీ సర్కారుకు భారీ ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. ఈ రెండు అంశాల్లో ఇప్పటికే ఎస్ఈసీ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం హైకోర్టులో సమర్దంగా తమ వాదన వినిపించగలిగింది. దీంతో హైకోర్టు కూడా ఎస్ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పోరుకు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రభావం వైసీపీకి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications