ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం.. యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే అతి పురాతన బిజినెస్ స్కూల్ ఎక్స్ ఎల్ ఆర్ ఐ 250 కోట్ల బడ్జెట్ తో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి రంగంలోకి దిగగా, ఇక తాజాగా ఏపీలోని మెడికల్ సెక్టార్ కు ఊతమిచ్చే విధంగా ఒక మెడ్ టెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఏపీలో అబుదాబీకి చెందిన M42 కంపెనీ పెట్టుబడులు
యూఏఈకి చెందిన M42 కంపెనీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం మూడు ఎకనామిక్ కారిడార్లలో పెట్టుబడులు, 9 మునిసిపాలిటీలలో హెల్త్ హబ్స్ నిర్మాణం, అమరావతి హెల్త్ సిటీ లో పెట్టుబడులకు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.

అబుదాబికి చెందిన ఎం 42 సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి
ఈ మేరకు ఏపీఐఐసీ టవర్స్ లోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అబుదాబికి చెందిన ఎం 42 సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ మొదటి స్థానంలో ఉన్నవిషయాన్ని, అలాగే సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎపి మెడ్ టెక్ జోన్, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 ఎకనమిక్ జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవకాశాలపైనా వారితో చర్చించామన్నారు.
ఎంఎఫ్2 ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటన చేశాక తుది నివేదిక
ఆసుపత్రుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని కనబర్చడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చే సరికొత్త టెక్నాలజీ అయిన జీనోమ్ సీక్వెన్సీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చిందన్నారు. ఎకనమిక్ కారిడార్లు, మెడ్ టెక్ జోన్ లలో ఎంఎఫ్2 ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటన చేశాక సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించిన మీదట తుది నివేదికను అందజేస్తారన్నారు.
పెట్టబడులు పెట్టే సంస్థలకు పూర్తి సహాయం
పలు దఫాలుగా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, అవసరమైన రాయితీల్ని కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెట్టుబడిదారులు సానుకూల దృక్పధంతో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications