బ్రేకింగ్ న్యూస్ వింటారని కేసీఆర్ చెప్పారు: రేవంత్ బెయిల్పై వాదనలు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం నాడు ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. 8వ తేదీలోగా బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ వేయాలని ఏసీబీని ఆదేశించింది.
పీపీ వాదనలు
రేవంత్ తీసుకు వచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాల్సి ఉందని, రూ.4.5 కోట్ల వివరాలు కూడా తెలియాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ కోర్టుకు విన్నవించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎవరెవరిని కొనేందుకు ప్రయత్నించారో తెలియాల్సి ఉందన్నారు. చాలామంది ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిగాయని చెప్పారు. రేవంత్ కాల్ డేటా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
రేవంత్ న్యాయవాది వాదనలు
రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సతీష్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి టార్గెట్ అని, ఆయనను పక్కా ప్రణాళికతో ఇరికించారని చెప్పారు. రేవంత్ ఎపిసోడ్కు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు విషయాన్ని చెప్పారన్నారు. స్టీఫెన్ ఇంటి వద్ద అంతకుముందే ఉదయం నుండే డబ్బులు ఉన్నాయని చెప్పారు.
రేవంత్ రెడ్డిని కస్టడీకి ఇస్తే అతని ప్రాణాలకు ముప్పు అని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ చెల్లదని సుప్రీం కోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. రేవంత్ను ఏసీబీ గత నెల 31వ తేదీన అదుపులోకి తీసుకొని, రోజంతా విచారించిందన్నారు.
మే 28న ఏసీబీ అధికారులకు సమాచారం ఉన్నా మే 31 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. వీడియో రికార్డింగ్కు రహస్య కెమెరాలు అమర్చారని, టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం అంతా కుట్రపూరితంగా జరిగిందన్నారు.
కస్టడీకి ఇస్తే రేవంత్ ప్రాణాలకు ముప్పు అన్నారు. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న నాలుగు అంశాలపై స్పష్టత లేదన్నారు. కాల్ రికార్డుల సేకరణకు రేవంత్తో పనేమిటని ప్రశ్నించారు. నాలుగో నిందితుడు మత్తయ్య ఎక్కడున్నాడో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు.
పరారీలో ఉన్న వ్యక్తి సమాచారం రేవంత్కు ఎలా తెలుస్తుందన్నారు. ఎక్కడ డీలింగ్ జరిగిందో ఏసీబీకి స్పష్టంగా తెలుసునని, రేవంత్ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రేవంత్ అరెస్టుకు ముందే కేబినెట్ సమావేశంలో కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ వింటారని కేసీఆర్ చెప్పారని తెలిపారు. కేసులో ఎవరి పాత్ర ఉందో తమకు తెలుసునని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారన్నారు. అనంతరం బెయిల్ పిటిషన్ వాదన 9వ తేదీకి వాయిదా పడింది.
మరోవైపు, కస్టడీ పిటిషన్ పైన సాయంత్రం నాలుగు గంటలకు వాదనలు కొనసాగుతాయి.