ఏపీలో తీవ్ర వడగాల్పులు-భానుడి భగభగలతో అల్లాడుతున్న జనం-తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
ఏపీపై భానుడి ప్రతాపం కనిపిస్తోంది. అసలు వేసవి ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా సూర్యుడి భగభగలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదలైన వేసవి తాపం ఇప్పుడు వడగాల్పుల రూపంలోకి మారింది. దీంతో కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కనిపిస్తోంది. ఇవాళ కోస్తాంధ్రలో వడగాల్పుల ధాటికి జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్న పరిస్ధితి ఉంది.
ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా వాటికి వడగాల్పులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం సాధారణం కన్నా కూడా రెండు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. ఏపీలోని నిన్న రెంటచింతలలో అత్యధికంగా 42 .6 డిగ్రీలు, నెల్లిమర్ల లో 41 .9 డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41 .5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ రోజు అడ్డతీగల , నెల్లిపాక , చింతూరు , గంగవరం, నర్సీపట్నం, మాకవరపాలెం తో పాటు 26 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం అల్లాడుతున్నారు. మారిన వాతావరణ పరిస్ధితుల్లో రిస్క్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఎక్కువ నీరు తాగమంటున్నారు. అలాగే కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్లు తాగడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షించుకోవాలని చెబుతున్నారు.
మరోవైపు వచ్చే ఐదురోజుల పాటు దేశంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్ , ఒడిశా మహారాష్ట్ర , ఛత్తీస్ గఢ్ లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications