ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద-రేపటికి 5 లక్షల క్యూసెక్కుల నీరు-పేర్నినాని హెచ్చరికలు
కృష్ణానదిలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో అక్కడి నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో చిట్టచివరి ఆనకట్ట అయిన ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
కృష్ణానదిలో వరద పరిస్ధితిపై మంత్రి పేర్నినాని అధికారులతో సమీక్షించారు. తాజా పరిస్ధితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో ఇవాళ సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి రానున్నట్లు మంత్రి వెల్లడించారు. రేపటి కల్లా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యారేజ్ దిగువన నదిలోకి ఎవరూ దిగొద్దని కోరారు.
శ్రీశైలంతో పాటు పులిచింతల నుంచి భారీగా అవుట్ ఫ్లోలు ఉన్నాయని, దీంతో బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు, పశువుల కాపర్లు ఎట్టి పరిస్ధితుల్లోనూ నదిలోకి వెళ్లొద్దని మంత్రి నాని సూచించారు. అటు బ్యారేజ్ లో వరద ప్రవాహంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
Recommended Video
ఎప్పటిలాగే విపక్ష నేత చంద్రబాబు ఇంటికి కూడా భారీ వరద ప్రవాహంతో ముంపు ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి పరిస్దితి చూశాక చంద్రబాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు.