మరో మూడ్రోజులూ వర్షాలే: ఏపీ అతలాకుతలం(పిక్చర్స్)
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమయ్యాయి. కాగా, ఈ విధంగా భారీ వర్షాలు మరో రెండు మూడు రోజులపాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొనడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. అంతేగాక, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలోనూ రెండ్రోజల వరకు .. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగతున్నాయని తెలిపారు.

వరద నీరు
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం కకావికలమైంది.

పొంగిపొర్లిన వాగులు, వంకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా జడివాన కురిసింది. సోమవారం రాత్రి దాదాపు రెండున్నర గంటలపాటు కుండపోత వర్షంతో ఒంగోలు నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. సోమవారం రాత్రినుండి మంగళవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తునే ఉంది. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకల్లోకి నీరుచేరాయి.

నీటమునిగిన రోడ్లు
ప్రధానంగా కొత్తపట్నం -ఒంగోలు మధ్య నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తపట్నం - ఒంగోలు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నల్లవాగుపై బ్రిడ్జి పనులు చేస్తున్న అధికారులు డైవర్షన్ రోడ్డును తాత్కాలికంగా వేశారు. ప్రస్తుతం డైవర్షన్ రోడ్డుపై వరదనీరు భారీగాప్రవహిస్తుండటంతో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు.

గండ్లు పడ్డాయి
అదేవిధంగా త్రిపురాంతకంలోని పాత అన్నసముద్రం చెరువుతెగిపోవటంతో రోడ్డుమీద నీరు ప్రవహిస్తోంది. ఇదిలాఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుపల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలురోడ్డులోని అపార్ట్మెంటు సెల్లార్లల్లోకి భారీగా వరదనీరు రావటంతో ఆయిల్ ఇంజన్ల సహాయంతో నీటిని బయటకు తోడుతున్నారు.

నిరాశ్రయులయ్యారు
రాత్రి 10నుంచి రెండున్నర గంటలపాటు భారీ వర్షం కురవడంతో ఒంగోలు ఆర్టిసి డిపో గ్యారేజిలోను, బయట మోకాల్లోతు నీరు చేరింది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రినుండి మంగళవారం ఉదయం వరకు సరాసరిన 57.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కూలిన ఇళ్లు
జిల్లావ్యాప్తంగా నెలకు సరాసరినా 133.6మిల్లీమీటర్లు కురవాల్సిఉండగా ఇప్పటివరకు 85మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సంతనూతలపాడు మండలంలో అత్యధికంగా 185.2మిల్లీమీటర్లవర్షపాతం నమోదైంది.

ప్రవాహం ఉధృతం
గుంటూరు జిల్లా పల్లెగుంత వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. నడికుడి-పిడుగురాళ్ల మధ్య ట్రాక్పైకి నీరు చేరింది. రెంటచింతలలో గోలివాగు ఉద్ధృతికి ఇళ్లలోకి నీరు చేరింది. దాచేపల్లి సమీపంలో నాగులేరు వాగు పొంగడంతో హైదరాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

వీధులన్నీ జలమయం
కరాలపాడు గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి వృద్ధురాలు మరణించింది. అటు ప్రకాశం జిల్లాలోనూ వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూండటంతో కొత్తపట్నం-ఒంగోలు మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

జనం ఇక్కట్లు
ఒంగోలు సమీపాన కర్నూలు రోడ్డులో ట్రాన్స్కోకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగిపోయాయి. సంతనూతలపాడులో 185 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

వరద ప్రవాహంలో కుండలు
కాగా ఈ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

చుట్టుముట్టిన జలం
గురజాల, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి, మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీవర్షాలకు మాచర్ల- గుంటూరు మార్గంలో గురజాల మండలం పల్లెగుంత వద్ద గండివాగు వరద ఉద్ధృతికి సుమారు అర కిలోమీటరు మేర రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్లను రద్దుచేశారు.

పోటెత్తాయి
నడికుడి- పిడుగురాళ్ల లైనులో పలు ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురజాల సమీపంలో దండివాగు పొంగి పొర్లటంతో పట్టణంలోని నాలుగు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో సుమారు నాలుగు వందల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్టాండ్లో షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి.

వరద ఉధృతికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
రోడ్లపై మూడడుగుల అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. వెంకట్రామరాజు కాలనీ, మేదరకాలనీలతో పాటు రెంటచింతలలో గోలివాగు వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇళ్లలో సామానులు సైతం వరదలో కొట్టుకుపోయాయి.

నీటిలోనే ప్రయాణ ప్రాంగణం
భారీ వర్షాలకు గుంటూరు నగరంతో పాటు పల్నాడు ప్రాంతంలో పలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. లైన్లు తెగిపడ్డాయి. గురజాల, మాచర్ల మండలాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. గురజాల బస్టాండు, ఆర్డీవో కార్యాలయాలను వరదనీరు చుట్టుముట్టింది.












Click it and Unblock the Notifications