ఏపీకి పొంచివున్న తుఫాన్ ముప్పు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది కాస్తా మరింత బలపడింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ అల్పపీడనం బలపడటం వల్ల ఫలితంగా ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది.
ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. పశ్చిమ- మధ్య వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుంది.

అనంతరం వాయవ్య దిశగా కదులుతుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారాయన. రైతులకు సూచనలు ఇచ్చారు.
బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీగా, మిగిలిన చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు.. తమ పొలం పనుల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ అంబేద్కర్ చెప్పారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications