దశాబ్దం తర్వాత: అనంతను ముంచెత్తిన భారీ వర్షం, ఆశ్చర్యంలో స్థానికులు..
గుత్తిలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి.
Recommended Video

అనంతపురం: అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది.గుత్తిలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. సంక్షేమ హాస్టళ్లు సైతం జల దిగ్బంధంలోనే ఉన్నాయి.
చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. పామిడి మండలంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పుట్టపర్తి, సోమన్నపల్లె ప్రాంతాల్లోను భారీ వర్షం కురిసింది.

నలుగురు మృత్యువాత:
వర్షాల ధాటికి తాడిపత్రి, పెనుగొండలో నలుగురు మృత్యువాత పడ్డారు. తాడిపత్రి పట్టణ శివారులోని పెన్నానదిలో ముగ్గురు గల్లంతయ్యారు. పట్టణంలోని గన్నెవారిపల్లె కాలనీకి చెందిన రమేశ్(13), పాతకోటకు చెందిన గణేశ్(13)లు శనివారం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.
వారి ఆచూకీ తెలుసుకునేందుకు గత రెండు రోజుల నుంచి అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సంఘటనా స్థలాన్ని చూసేందుకు పెన్నానది తీర ప్రాంతానికి వెళ్లిన భగత్సింగ్నగర్ వాసి ఇర్ఫాన్ కూడా ఆదివారం గల్లంతయ్యాడు. వారి కోసం 4పడవల్లో 9 మంది గజ ఈతగాళ్లు పెన్నానదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

పొంగుతున్న చెరువులు, నాలాలు:
హిందుపురంలో చెరువులు, నాలాలు పొంగుతున్నాయి. గత 48గంటల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జిల్లాలోని పది మండలాలు అస్తవ్యస్తంగా మారాయి.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వర్షం దానికి తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. జిల్లా అధికారులంతా అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

దశాబ్దంలో ఇదే తొలిసారి:
గత దశాబ్దకాలంలో అనంతపురంలో ఇంత భారీ వర్షం కురవలేదని స్థానికులు చెబుతున్నారు. కేవలం మూడు గంటల్లోనే 12 సెంటీ మీటర్ల వర్షం కురవడం విశేషం. సాయంత్రం చిన్నగా మొదలైన వర్షం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కుంభవృష్టిగా మారింది.
వర్షం ధాటికి పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మోకాలిలోతు నీటిలో ఆయా ఊర్లు జలదిగ్బంధనమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

ఎమ్మెల్యే ఆర్థిక సహాయం:
పెన్నానదిలో గల్లంతైన రమేశ్, గణేశ్ కుటుంబాలకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి రూ.50,000 చొప్పున ఆర్థికసాయం అందించారు. మృతదేహాలు వెలికి తీసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం కూడా తాడిపత్రిలో భారీ వర్షం కురిసింది. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నది దగ్గరకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications