వరదలో మునిగిన బస్సు: హైద్రాబాద్లో ముగ్గురు మృతి
హైదరాబాద్/ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఓ బస్సు వరద నీటిలో మునిగిపోయింది. బస్సులో ఏడుగురు ప్రయాణీకులు చిక్కుకోవడంతో అధికారులు తాళ్ల సాయంతో వారిని కాపాడారు. మార్కాపురం డిపోకి చెందిన బస్సు హైదరాబాదు నుండి ఒంగోలు వెళ్తున్న సమయంలో కొనకళ్లమెట్ల ప్రాంతంలో వరదలో చిక్కుకుపోయింది.
బస్సు వరదలో చిక్కుకున్న సమయంలో పదిహేను మంది ప్రయాణీకులు ఉండగా అందులో ఎనిమిది మంది అప్పుడే బయటపడ్డారు. మరో ఏడుగురు అందులోనే చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. వారిని తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకు వచ్చారు.
గుంటూరు జిల్లా నరసారావుపేటలో మరో బస్సు వరద నీటిలో చిక్కుకుంది. కర్నూలు నుండి నరసారావుపేటకు వస్తున్న ఈ బస్సు చప్టా వద్ద చిక్కుకుపోయింది. బస్సులో నలభై మంది ప్రయాణీకులు ఉన్నారు. మరోవైపు భారీ వర్షాలు కారణంగా లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది.
వాగులో ముగ్గురు గల్లంతు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం సూరావారిపాలెంలోని వాగులో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరోచోట ఇద్దరు మహిళలు వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భారీ వర్షాలకు పురాతన భవనం కూలిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా పదకొండు మంది మృతి
వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పదకొండు మంది వరకు మృతి చెందారు. హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. మాసాబ్ ట్యాంకులోని కోటమ్మ బస్తీలో బిఈడి కళాశాల గోడ కూలి ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పార్వతి, లక్ష్మీ, జనార్ధన్లుగా గుర్తించారు. కడప జిల్లాలో రాచెరువు వద్ద మూడు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. కాగా ఈ మృతదేహాలు ప్రకాశం జిల్లాలో కొట్టుకు పోయిన వారిగా అధికారులు గుర్తించారు.