టీటీడీ హైఅలర్ట్- 700 పేజీల యాక్షన్ ప్లాన్
Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- దక్షిణ కోస్తా తీర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమౌతూ వస్తోంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తం అయ్యారు. విపత్తు నిర్వహణ ముందస్తు ప్రణాళికపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వర్చువల్ సమావేశం నిర్వహించారు.
వచ్చే 48 గంటల్లో తిరుపతిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలను జారీ చేసిందని గుర్తు చేశారు. 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని, ఇది బాగుందని కితాబిచ్చారు. దీన్ని మరింత మెరుగు పరచాలని సూచించారు.
ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని, దీనికి తోడు- అగ్నిమాపక, ఆరోగ్య శాఖ, విజిలెన్స్, ఇతర కీలకమైన శాఖలు, విభాగాధిపతులు, అక్కడిసిబ్బందితో ప్రత్యేకంగా మరో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Disaster Management Review Held
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 14, 2024
TTD EO and Additional EO Ch Venkaiah Chowdary met to discuss disaster preparedness amid heavy rain alerts. All Tirumala departments must be ready, refining the 700-page plan and ensuring communication through WhatsApp and Channel 10. pic.twitter.com/nybjzkyBuN
తిరుమల ఘాట్ రోడ్లల్లో కొండ చరియలు విరిగిపడటంపై ప్రత్యేక నిఘా ఉంచాలనీ శ్యామలరావు సూచించారు. ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. కొండచరియలు విరిగిపడితే వాటిని వెంటనే తొలగించేలా జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు, తగినంత సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
తిరుమలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని, వాటిని నడపడానికి తగినంత డీజిల్ సిద్ధం చేసుకోవాలని శ్యామలరావు సూచించారు.
విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడంలో భాగంగా టీటీడీ వైద్య శాఖ సిబ్బంది అంబులెన్సు లను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తిరుమలలో జలాశయాలు నిండుతున్నందున డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications