నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు: మహిళ గల్లంతు, కొట్టుకోపోయిన ఆర్టీసీ బస్సు
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరులో గత రెండు రోజులుగా కురుస్తున్నాయి. దీంతో నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చెన్నై-విజయవాడ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జిల్లాలోని అనేక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉప్పుటేరులో ఓ వ్యక్తి గల్లంతు కాగా, చిల్లకూరు మండలంలో తిప్పగుంటపాలెం జల దిగ్బంధనంలో చిక్కుకొంది. డక్కిలి మండలం కమ్మపల్లి వద్ద ఎఎన్ఎం రాజమ్మ వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది.
కావలిలో 9.5 సెంమీ వర్షపాతం నమోదైంది. సోమశిల జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉగ్ర రూపం దాల్చింది. జిల్లాలోని గూడూరు వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలోని కండలేరు, కుక్కుటేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిప్పకుంటపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గూడూరు మండలంలోని కైవల్యానది పొంగి ప్రవహిస్తుంది. ఆత్మకూరు, చమడపాలెం, జీఎస్ కండ్రిగ, రామలింగాపురం, విండూరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు చిత్తూరు కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంగళవారం సూచించారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు ఆయన చెప్పారు.
అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిద్దార్థ్ జైన్ చెప్పారు.
కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు, సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలో ఓ బస్సు వాగులో కొట్టుకోపోయింది. ఈ ప్రమాదం వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే ప్రయాణికులతో తిరుపతి నుంచి చిత్తూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలతో తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా తలపిస్తున్నాయి. దీంతో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఏపీ దేవాదయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తిరుమలలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పాపవినాశనం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.