ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం (ఫోటోలు)
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాల కారణంగా చేరిన వరద నీటితో రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో వాగుల వరద ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఖరీఫ్ కోసం వేసిన నారుమడులు నీట మునిగాయి.
మరోవైపు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు నమోదైంది. గత కొన్నిరోజులనుండి అడపా దడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఖరీఫ్పంటను సాగుచేసుకునేందుకు ముందుకు దూకుతున్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సరాసరిన 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా 96.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు వరదతో ఏకమై ప్రవహిస్తున్నాయి. కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామ సమీపంలోని పెద్దతండా వద్ద మున్నేరువాగు పొంగి ప్రవహిస్తోంది.
అలాగే, మంగపేట మండలం రాజుపేట ముసలమ్మవాగు ఉప్పొంగటంతో గ్రామంలోని నలబై ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వరద తీవ్రత ఇంకా పెరుగుతోంది. అలాగే, భూపాలపల్లి- పరకాల మార్గంలో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఖమ్మం జిల్లావ్యాప్తంగా మూడు రోజుల నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. వర్షాలతో జనజీవనం అస్తవస్త్యమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైకి చేరుకున్న వరద నీటి కారణంగా మంగళవారం ఉదయం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
వాహనాలతో రోడ్లపైకి వచ్చిన నగర వాసులు ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా.. పంజాగుట్ట, మోడల్ హౌస్, ఆలుగడ్డబావి, మెట్టుగూడ, మలక్పేట్, తార్నాక, హబ్సిగూడ, శ్రీనగర్ కాలనీ, తిరుమలగిరి, బేగంపేట్, రాజ్భవన్ రోడ్డు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
విభజన సమయంలో విలీన మండలమైన వేలేరుపాడు మంగళవారం నుంచి దిగ్బంధానికి గురైంది. కుకునూరు మండలంలోని గుండేటి వాగు పొంగిప్రవహిస్తుండటంతో గొమ్ముగూడెం, కుకునూరు, దాచారం తదితర గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవటంతో ఈ మండలం కూడా అంధకారంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం పొలం వెళ్లిన ఇద్దరు రైతులు ఒక్కసారిగా వాగులు పొంగటంతో సాయంత్రం వరకు అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం గజఈతగాళ్ల సాయంతో వారిని రక్షించారు.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
బుట్టాయగూడెం మండలంలో జల్లేరువాగు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విప్పలపాడు వద్ద జల్లేరు వాగు వరద ఉద్ధృతికి కాలువగట్టు భారీగా కోతకు గురైంది. దొరమామిడి శ్రీగుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు చేరింది.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
చింతలపూడి ఎత్తిపోతల పధకం కోసం తవ్వుతున్న కాల్వలో ఈతకొట్టేందుకు వెళ్లిన గుర్రం వినయ్(14) మృత్యువాత పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కూనవరం మండలంలో బుధవారం 13.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో కోండ్రాజుపేట కాజ్వేపై వరదనీరు చేరింది. దీంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
ఖమ్మం జిల్లావ్యాప్తంగా మూడు రోజుల నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. బుధవారం రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలో 16 సెంటీ మీటర్లు నమోదు కాగా, జిల్లావ్యాప్తంగా 28 సెం.మీ.ల వర్షపాతం నమోదయింది.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
ఎడతెరిపి లేని వర్షంతో ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలాపేరు ప్రాజెక్ట్లోకి వరద నీరు చేరటంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
కిన్నెరసాని ప్రాజెక్ట్లో 400 అడుగులకు నీటిమట్టం చేరటంతో ఆరు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు నిండటంతో మూడు గేట్లు ఎత్తి దాదాపు 25వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
ఒడిశా ఎగువ ప్రాంతంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తోటపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటిమట్టం పెరగడంతో అధికారులు మూడుగేట్లు ఎత్తివేసి సుమారు 2,800 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నారు.

ఎడతెరిపి లేని వర్షాలు: విలీన మండలాల పరిస్థితి దారుణం
రోజురోజుకు నీటిమట్టం పెరగడంతో కిమ్మి-రుషింగి వంతెన పనులకు ఆటంకం కలిగింది. నదిలో వేసిన కాజ్వే కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వంగర, వీరఘట్టం మండలాల ప్రజలు నదిలో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం రుషింగి గ్రామం వైపు ప్రవహిస్తోంది.












Click it and Unblock the Notifications