పెద్దవాళ్లని కూడా చూడరా?: ఎంపీల అరెస్ట్పై బాబు ఆగ్రహం, 'రెండ్రోజుల్లో తేల్చకుంటే ఆమరణ దీక్ష'
అమరావతి: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద నిరసన చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. తమ ఎంపీల అరెస్టు అమానుషం అన్నారు. ఎంపీలని కూడా చూడకుండా, పెద్ద వయస్సులో ఉన్నవారు అని కూడా చూడకుండా అమానుషంగా లాగేస్తారా అన్నారు.
పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది: మోడీపై జేసీ తీవ్రవ్యాఖ్యలు, 'చంపుతారా.. చైనా, రష్యాలా ఉంది'
ఈ అరెస్ట్ దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారి పట్ల పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఇది కేంద్రం దమననీతికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
అరెస్టులు అమానవీయం
ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలను నిలబెట్టుకోవాలని శాంతియుతంగా నిరసనలు తెలిపితే అరెస్టులు చేయడం అమానవీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఆయన ఆదివారం సాయంత్రం ఎంపీలకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, జేసీ దివాకర్ రెడ్డిలను పరామర్శించారు. పెద్దవారు అని కూడా చూడలేదన్నారు. కాగా, ఎంపీలను ఢిల్లీ నుంచి వచ్చేయాలని చంద్రబాబు సోమవారం ఆదేశించారు.
వైసీపీ ఎంపీ దీక్ష కొనసాగినంత కాలం ఆందోళనలు
ఇదిలా ఉండగా, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో తమ పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నారు. వారు ఢిల్లీ నుంచి రానున్నారు. వారు సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సమాది రాజ్ ఘాట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్ ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించారు. మరోవైపు, ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షలు కొనసాగినంత కాలం ఏపీలో జిల్లా, మండల స్థాయిల్లో హోదా కోసం నిరసనలు టీడీపీ నిర్ణయించింది.
ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ రిలే నిరాహార దీక్షకుదిగారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె అధికారులతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హోదాపై రెండ్రోజుల్లో కేంద్రం స్పందించకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
కేంద్రం మొండి వైఖరి
ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షలో సిబ్బందితో పాటు జానీమూన్ కూర్చున్నారు. 14వ ఆర్థిక సంఘంను సాకుగా చూపి జిల్లా పరిషత్, మండల పరిషత్లకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా హోదా, విభజన హామీల అమలులో కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు.