జగన్ కు సోరెన్ మరో తలనొప్పి ? ఈసారి సీపీఎస్ రద్దుతో దెబ్బ-ఇప్పటికే అనర్హత పోలిక!
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైఎస్ జగన్ కు, జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సోరెన్ కూ మధ్య పోలికలతో పాటు పోరు కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో వ్యవసాయ చట్టాల మీద సోరెన్ వైఖరిపై జగన్ ట్వీట్ చేసి ఈ వార్ మొదలుపెట్టగా.. ఆ తర్వాత సోరెన్ పై అనర్హత వేటు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటుందా అన్న వాదన వినిపించింది. తాజాగా ఇదే క్రమంలో ఏపీలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న వేళ.. జార్ఖండ్ లో సోరెన్ ఆ నిర్ణయం తీసేసుకుని జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టారు.
జగన్, సోరెన్ పోలిక
ఏపీ సీఎం వైఎస్ జగన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇద్దరూ యువ ముఖ్యమంత్రులే. జగన్ తొలిసారి సీఎం అయితే, సోరెన్ రెండోసారి సీఎంగా ఉన్నారు. ఇద్దరూ తమదైన నిర్ణయాలతో పాలనపై ముద్ర వేస్తున్న వారే. అలాగే వివాదాల్లోనూ ఇద్దరికీ పోలికలు కనిపిస్తున్నాయి. గతంలో రైతులు వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న వేళ జార్ఖండ్ సీఎం సోరెన్ వారికి మద్దతు పలకడాన్ని సీఎం జగన్ తప్పబడుతూ ట్వీట్ పెట్టారు.
ఆతర్వాత తాజాగా తనకు సొంతంగా గనులు కేటాయించుకున్న వ్యవహారంలో సోరెన్ పై అనర్హత వేటు కత్తి వేలాడుతుండగా.. జగన్ కూడా తన కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్ కు అనుమతులు ఇచ్చుకున్న వ్యవహారంలో అనర్హత వేటుకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సోరెన్ మరో నిర్ణయం తీసుకున్నారు.
జార్ఖండ్ లో సీపీఎస్ రద్దు
జార్ఖండ్ లో ఏపీ తరహాలోనే ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే ఏపీలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జార్ఖండ్ లో సోరెన్ ఉద్యోగులకు హామీ ఇవ్వలేదు. కానీ తాజాగా సీపీఎస్ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఈ సెప్టెంబర్ నుంచే సీపీఎస్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తద్వారా ఉద్యోగుల మద్దతు సంపాదించుకున్నారు. సోరెన్ నిర్ణయంతో ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ జాబితాలోకి జార్ఖండ్ కూడా చేరిపోయింది. అంతే కాదు ఉద్యోగులు సీపీఎస్ పై ఆందోళన చేస్తున్న ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి మరింత పెరిగింది.
సోరెన్ నిర్ణయంతో జగన్ పై ప్రభావం
జార్ఖండ్ లో సీపీఎస్ విధానం రద్దు చేస్తూ సోరెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి అమాంతం పెరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సీపీఎస్ ను రద్దుచేయడంతో ఏపీలోనూ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
అదేసమయంలో సోరెన్ తీసుకున్న సీపీఎస్ రద్దు నిర్ణయం కచ్చితంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచబోతోంది. ఇప్పటికే ఉద్యోగులు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధం కాగా.. ప్రభుత్వం వారిని అరెస్టులతో అడ్డుకుంది. దీంతో సెప్టెంబర్ 11కు దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జార్ఖండ్ సర్కార్ నిర్ణయంతో వారిలో ఆక్రోశం మరింత పెరగబోతోంది.
జగన్ కు తలనొప్పిగా సోరెన్?
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఉద్దేశించి జగన్ ఎప్పుడైతే ట్వీట్ పెట్టారో కానీ.. అప్పటి నుంచి జగన్ కు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రంపై పోరు విషయంలో జార్ఖండ్ తో ఏపీకి గతంలో విపక్షాలు పోలిక పెట్టాయి. ఆ తర్వాత సోరెన్ పై అనర్హత వేటు వ్యవహారం జగన్ కు కూడా వర్తింపజేసి విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి.
ఇప్పుడు సోరెన్ సీపీఎస్ రద్దు చేయడంతో ఏపీలోనూ జగన్ అదే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోరెన్ పదే పదే జగన్ కు తలనొప్పులు తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇందులో సోరెన్ తప్పున్నా లేకపోయినా జగన్ కు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.