కేరళలో నిషేధించలేదు: హెరిటేజ్ పాల కంపెనీ వివరణ
హైదరాబాద్: హెరిటేజ్ పాల ఉత్పత్తుల పైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ సాగిన విషయం తెలిసిందే. దీని పైన హెరిటేజ్ సంస్థ ప్రెసిడెంట్ సాంబశివ రావు బుధవారం స్పందించారు. కేరళ రాష్ట్రంలో తమ సంస్థ ఉత్పత్తులను నిషేధించారని చెప్పడం వాస్తవం కాదన్నారు.
హెరిటేజ్ సంస్థకు సొంతగా ఆవులు లేదా గేదెలు లేవని చెప్పారు. కేరళలో హెరిటేజ్ సంస్థకు చెందిన పద్మనాభ పాలను మాత్రమే నెల రోజుల పాటు నిలిపారని వివరణ ఇచ్చారు. ఆ పాలు తప్ప మిగతా ఉత్పత్తులు అన్నీ కేరళ రాష్ట్రంలో అమ్మకాలు జరిగాయన్నారు. పద్మనాభ పాలను కూడా నాణ్యతా ప్రమాణాలు చూశాక అమ్మేందుకు అనుమతించారని చెప్పారు.
కాగా, కల్తీ పాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ శాసనసభలో మంగళవారం, బుధవారం తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి దీని పైన ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా పాలను సేకరించాలన్న దురుద్దేశంతో పాడి పరిశ్రమ రైతులు గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఆక్సిటోసిన్ కలిగిన పాలతో తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరిపడినంత మంది పశువైద్య నిపుణులు, సహాయక సిబ్బంది లేని కారణంగానే ఈ తరహా వ్యాపారం విస్తరిస్తోందన్నారు. హెరిటేజ్ సంస్థ పాలను కల్తీ చేస్తోందని కేరళలో బ్యాన్ చేశారన్నారు. హెరిటేజ్ ఉత్పత్తుల పైన అనుమానాలున్నాయని చెప్పారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తదితరులు కూడా హెరిటేజ్ పాల అంశాన్ని ప్రస్తావించారు.
దీని పైన మంత్రి రాజయ్య తదితరులు స్పందించారు. పంజాగుట్టలో తీసిన హెరిటేజ్ శాంపిల్లో డిటర్జెంట్లు ఉన్నట్లు తేలిందన్నారు. పాల కల్తీని సీరియస్గా పరిగణిస్తున్నామన్నారు. కల్తీ దందా చేస్తున్న వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ విషయమై ఇప్పటికే 11 కంపెనీల పైన కేసులు నమోదు చేశామన్నారు.
హెరిటేజ్ పాల పైన తెరాస సభ్యులు వ్యాఖ్యానించడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. కేరళలో ఆ పాలను నిలిపివేయలేదని చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హెరిటేజ్ అక్రమాల పైన మాట్లాడితే టీడీపీకి ఉలుకెందుకన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడకుండా టీడీపీ నేతలు హెరిటేజ్ సంస్థ డైరెక్టర్లుగా మాట్లాడుతున్నారన్నారు.