టీచర్గా మారిన కథానాయకుడు బాలకృష్ణ
సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సతీసమేతంగా అక్కడికి వెళ్లిన బాలయ్య నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతి కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండోరోజు సైతం ఆయన పర్యటన కొనసాగింది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాలకు హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఎల్ఈడీ టీవీలను అందజేశారు.
ఈ సందర్భంగా బాలయ్య అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాధ్యాయుడిగా మారిన కథానాయకుడు తనదైన స్టైల్లో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియా వైపు వెళ్లొద్దని, ఫేస్బుక్ చూస్తూ కాలం వృథా చేయొద్దంటూ హెచ్చరించారు. తల్లిదండ్రులకు, దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలని ఆకాక్షించారు. హిందూపురంలో అంధుల పాఠశాలను, నవోదయ విద్యా సంస్థను తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు.
ప్రస్తుతం బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. సినిమా షూటింగ్ లకు విరామం దొరికినప్పుడల్లా స్థానికులకు అందుబాటులో ఉంటున్నారు. అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికి శుభమస్తు.. మన హిందూపురం.. మన బాలయ్య అని ఆరోగ్య రథంపై చిత్రించారు.