ఈ రోజు కూడానా.. వద్దువద్దు!: తెలుగుపై జూ.ఎన్టీఆర్ ప్రేమ,
హైదరాబాద్: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం నాడు తెలుగు పైన అవ్యాజమైన ప్రేమను కురిపించారు. కనీసం మాతృభాషా దినోత్సవం రోజు అయినా మాతృభాషలో మాట్లాడాలన్నారు. హైదరాబాదులోని మాదాపూర్లో టెంపర్ సక్సెస్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదే సమయంలో కొంత ఇంగ్లీషులో మాట్లాడారు. ఆ తర్వాత ఈ రోజు కూడా ఇంగ్లీషులోనా అని చెబుతూ.. తెలుగులో మాట్లాడారు. రోజు ఏ భాషలో మాట్లాడినా కనీసం ఈ రోజు అయినా మన తెలుగు భాషలో మాట్లాడుదామని... తెలుగులో విజయం గురించి మాట్లాడారు.
కాగా, శనివారం మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా పలుచోట్ల ఈ సంబరాలు జరిగాయి. బెజవాడలో ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఉద్యమంలా తెలుగు భాష కోసం పాటుపడాలన్నారు. ప్రతి ఇంటా మాతృభాషోధ్యం సాగాలన్నారు. ప్రపంచ భాషగా తెలుగును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు.