ఆంధ్రప్రదేశ్లో 'హీరో': బాబుతో పవన్ భేటీ, చిత్తూరులో!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సుమారు రెండు గంటలపాటు భేటీ అయ్యింది.
భేటీ వివరాలను టీడీపీపీ నేత సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటుకు హీరో సంస్థ ప్రతినిధులు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. శనివారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తొలుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన్ను పరామర్శించారు. అనంతరం హీరో ప్రతినిధులతో భేటీ అయ్యారు.
చంద్రబాబుతో హీరో సంస్థ సీఈవో పవన్ కాంత్ ముంజాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థ ఏర్పాటు చేయడానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై సుమారు గంటన్నర సేపు చంద్రబాబుతో మాట్లాడారు. పరిశ్రమ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని బాబు చెప్పారని తెలుస్తోంది.
కేంద్రం నుండి రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలు రానున్న నేపథ్యంతో పాటు దక్షిణాదికి కేంద్రంగా ఉన్న ప్రాంతం కావడంతో హీరో సంస్థ ఏపీలో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్వయంగా సర్వే నిర్వహించుకొని తమకు అనువుగా ఉన్న ప్రాంతానికి సంబంధించిన నివేదికను సోమవారం చంద్రబాబుకు అందివ్వనుంది.
దక్షిణాదిలో తొలిసారి ప్రాజెక్టు ఏర్పాటుకు హీరో ఇటు తమిళనాడు, అటు కర్నాటక రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుందని చిత్తూరును ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. రూ.3వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు తమకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబుతె చెప్పినట్లుగా తెలుస్తోంది.