పవన్ 'నాలుక కోస్తా'మని ఎందుకు అనలేదు?: టీడీపీ ఎంపీకి హీరో శివాజీ
అమరావతి: హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం విజయవాడలో నిర్వహిస్తోన్న బంద్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాను మాట్లాడితే ఓ ఎంపీ తన నాలుక కోస్తానని హెచ్చరించారని చెప్పారు.
శివాజీ నాలుక కోస్తానన్న ఎంపీ శివప్రసాద్.. మరోసారి ఆ మాటెత్తవద్దని వార్నింగ్
మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోదా కోసం గళమెత్తితే ఆయనను నాలుక కోస్తా అని ఎందుకు అనలేదని శివాజీ ప్రశ్నించారు. అభిమానులు, ప్రజలు తిరగబడతారని భయపడుతున్నారా? అని నిలదీశారు. మనిషిని బట్టి ఎంపీలు ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
హోదాపై ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని శివాజీ ప్రశ్నించారు. హోదా సాధన విషయంలో మనం ఎందుకు భయపడాలన్నారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే వారంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని శివాజీ అన్నారు. పవన్ తన శక్తిని కరెక్ట్గా వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు నమ్మిన వ్యక్తి పవన్ అని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయంటున్నారు.. ఏవేవో మాటలు చెబుతున్నారని మండిపడ్డారు.
అప్పుడపప్పుడు కేంద్రం బిక్షమేస్తోందని, ఇచ్చింది తీసుకోవాలనే ధోరణి వద్దని ఏపీ ప్రభుత్వానికి శివాజీ సూచించారు. తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని, ఆంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉందన్నారు. పవన్ జనసేన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు.
అదేవిధంగా శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు గుప్పించమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడం ఏపీ ప్రభుత్వం వైఫల్యమేనని అన్నారు. ప్రజలను ప్రభుత్వ నేతలు మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ప్రజలను మభ్యపెడుతుందని, పోలవరం అంత ఈజీగా పూర్తవుతుందా? అని శివాజీ ప్రశ్నించారు. ఇక రాజధాని నిర్మాణం విషయానికి వస్తే భూసేకరణ ఇంకా జరగాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. దాని కోసం అందరూ కలిసి పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications