పవన్ కళ్యాణ్! మీరొక్కరు చాలు, ఆయనా దేశద్రోహేనా: 'హోదా'పై హీరో శివాజీ
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సినీ నటుడు శివాజీ జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఓ సూచన చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు రోడ్డు మీదకు వస్తే చాలు, సమస్య పరిష్కారం అవుతుందని శివాజీ అభిప్రాయపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన చేతులెత్తేసినట్లుగా మాట్లాడిన కేంద్రం పైన శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులేనా అని ప్రశ్నించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారని, ఆయన కూడా దేశద్రోహేనా? అని నిలదీశారు.
ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ విషయమై ఓ ఛానెల్లో శివాజీ తన అభిప్రాయం చెప్పారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ స్పందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పవన్ కళ్యాణ్ చాలా కచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పారని, అధికార, ప్రతిపక్ష నేతలందరూ మీనమేషాలు లెక్కపెడుతున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశమని, దేశం చక్కగా ఉండాలంటే రాష్ట్రాలు కూడా బాగుండాలన్నారు.
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించిన తనపై దేశద్రోహం కేసు పెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టగా, హోదాపై కేంద్రమంత్రి చేతులెత్తిసిన విషయం తెలిసిందే.