నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబు
అమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి తెలిసిందే. బుధవారం అమరావతి నుంచి అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొందరు హీరోలు నేరస్థులను కలుస్తున్నారని పరోక్షంగా నాగార్జున ఇష్యూను లేవనెత్తారు.
నేరస్థులతో సమావేశమా ..?
హీరోలు నేరస్థులను కలువడం పారిపాటిగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తో నాగార్జున భేటీ ఇందుకు ఉదహరణ అని ప్రస్తావించారు. ఆర్థిక నేరస్థులతో హీరోలు, పారిశ్రామిక వేత్తలు ఎందుకు సరెండర్ అవుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఓర్వలేని తనమేనా ..?
ప్రతిపక్ష నేత జగన్ ను హీరోలు కలిస్తే తప్పేంటనే వాదన వినిపిస్తోంది. ఓ పార్టీ అధినేతగా హీరోలు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. ఇందులో తప్పేం ఉందో అర్థం కావడం లేదని .. ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ నేరస్థుడు ఎలా అవుతారనే అని కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ కు వస్తున్న ప్రజాధారణను చూసి ఓర్వలేక చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
వచ్చారు .. మాట్లాడారు .. వెళ్లారు ...
మంగళవారం సాయంత్రం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అరగంట పాటు వివిధ అంశాలపై కూలంకుషంగా డిస్కషన్స్ జరిగాయి. ఆ తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
టికెట్ కోసమేనా ..?
జగన్ తో నాగార్జున భేటీ వెనుక రాజకీయాలే ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన సన్నిహితుడికి వైసీపీ తరఫున గుంటూరు ఎంపీ టికెట్ కోసం సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో నాగార్జున రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ వైఎస్ హయాంలో ప్రభుత్వ పథకాల ప్రకటనల్లో మాత్రం నటించారు. మరి ఇప్పుడు జగన్ తో సమావేశమైన నాగార్జున .. హితుడికి టికెట్ ఇప్పించడం కోసమేనా ? లేదంటే రాజకీయాల్లోకి వస్తారా అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.
ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందా ..?
హీరో నాగార్జున అధికారంలోకి వచ్చే నేతలతో సమావేశమవుతుంటారు. ఇదివరకు వైఎస్ఆర్ సీఎం కాకముందే నాగార్జున ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారకర్తగా కూడా పనిచేశారు. ఇప్పుడు జగన్ తో భేటీ కూడా .. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ ఊహాగానాలకు తెరపడాలంటే .. వచ్చే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సందే.