అమరావతి రైతుల ముందు కొత్త ప్రతిపాదనలు: జిల్లాల వారీ అభివృద్ధి: మరోసారి హైపవర్ కమిటీ భేటీ..!
మూడు రాజధానుల ప్రతిపాదనల మీద నియమించిన హైపవర్ కమిటీ రెండో దఫా సమావేశం కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనలను మద్దతుగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీతో పాటుగా బోస్టన్ కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఈ రెండింటిపైనా అధ్యయనం చేసి..ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం పది మంది మంత్రులు..అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. తొలి సారి సమావేశమైన ఈ కమిటీ దాదాపు రెండు కమిటీల అభిప్రాయాలతో ఏకీభవించింది. అయితే, ప్రస్తుతం అమరావతి ప్రాంత రైతుల ఆందోళన దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రెండో సారి సమావేశం అవుతున్న హైపవర్ కమిటీ ప్రధానంగా అమరావతి రైతుల ముందు ప్రతిపాదనలు..జిల్లాల వారీ అభివృద్ధి పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
హైపవర్ కమిటీ రెండోసారి బేటీ..
రాజధానుల అంశం పైన హైపవర్ కమిటీ రెండో విడత భేటీ ఖరారైంది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఈ కమిటీ సమావేశం అవుతుంది. తొలి భేటీలో జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ ప్రతినిధులు తమ కమిటీ సిఫార్సుల పైన హైకమిటీకి నివేదించారు. అయితే, అధికారిక వికేంద్రీకరణ అవసరమనే అభిప్రాయంతో హైపవర్ కమిటీ సైతం ఏకీభవించనట్లుగా సమాచారం. అయితే, ఇప్పుడు అమరావతిలో రైతుల ఆందోళన..అక్కడి నుండి రాజధాని తరలిస్తే తాము అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చామని..ఇప్పుడు నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు మద్దతు గా నిలుస్తున్నారు. దీంతో..అధికారిక నిర్ణయం తీసుకోవటానికి ముందే అమరావతి ప్రాంత రైతుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాజధాని రైతలు ముందు ప్రతిపాదనలు
మరోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ సమావేశం..ఈ సారి రాజధాని రైతుల విషయమై రెండో భేటీలో చర్చించి..ప్రభుత్వం నుండి రైతులకు సానుకూల సంకేతాలివ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా అమరావతి ప్రాంత రాజధాని రైతుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో..ల్యాండ్ పూలింగ్ రైతులను సంతృప్తి పరిచేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదే సమయంలో కేవలం రాజధానుల గురించే కాకుండా.. జిల్లాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన పైనా హైపవర్ కమిటీ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు ఇప్పటికే స్పష్టం చేసారు. కమిటీ నివేదిక అందిన తరువాత దాని పైన కేబినెట్ లో చర్చించి.. అసెంబ్లీలో తీర్మానం చేసి అధికారికంగా మూడు రాజధానుల అంశాన్ని లాంఛనంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications