రెండు జిల్లాలను ముంచెత్తిన వరదలు: ప్రకాశం జిల్లాకు ముప్పు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఈ రెండు జిల్లాల్లో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ తర్వాత వర్షాలు ఉత్తరదిశగా కదిలాయి. దీంతో ప్రకాశం జిల్లాకు ముప్పు పొంచి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాగులూ వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.
సువర్ణముఖి, కాళింది నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. ఇళ్లకు నీరు చేరడంతో సూల్లూరుపేటలోని ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. నెల్లూరు జిల్లాలోని కైవల్య, కలంగి, పెంబలేరు, స్వర్ణముఖి నదులు పొంగిపొర్లుతున్నాయి.
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జాతీయ విపత్తుల ప్రతిస్పందన సంస్థ రంగంలోకి దిగింది. పడవల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్టీసి బస్సులు నడవడం లేదు. రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. చెన్నై, గూడూరు సెక్షన్లోి రైల్వే వంతెనలపై నీరు ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది.

అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులను హెచ్చరించారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కలెక్టర్లతోనే కాకుండా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు, వరదలకు 54 మంది మరణించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
గత నెలలో వచ్చిన తుఫాన్లు, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.6.75 వేల కోట్ల మేర నష్టం సంభవించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణ సాయం కింద రూ.3.750 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలున్నాయని ఆయన చెప్పారు. వర్షాలు, వరదలతో అతలాకుకతలమైన చెన్నైలోని తెలువుగారిని కాపాడేందుకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపించామని చెప్పారు. రాష్ట్రంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో కొన్నింటిని ఇప్పటికే చెన్నై తరలించినట్లు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications