కుదరదు!:జగన్ అక్రమాస్తుల కేసులో...మినహాయింపు కోరిన దాల్మియా పిటిషన్ కొట్టేసిన హైకోర్టు!
హైదరాబాద్:వైఎస్ జగన్ కంపెనీల్లో 'పెట్టుబడి' పెట్టిన దాల్మియా సిమెంట్స్ డైరెక్టర్ పునీత్ దాల్మియా తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
వైఎస్ జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రో కో పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం తీవ్రమైన ఆర్థిక నేరమని...ఇందులో నిందితులు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నిందితుల 'స్టేటస్' ఆధారంగా హాజరు మినహాయింపు కోరడం సరికాదని గతంలో అనేక న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని ఈ సందర్భంగా హై కోర్టు తేల్చి చెప్పింది.
జగన్ కంపెనీల్లో 'పెట్టుబడి' పెట్టిన దాల్మియా సిమెంట్స్ డైరెక్టర్ పునీత్ దాల్మియా విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం.సత్యనారాయణ తీర్పు చెప్పారు. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులు ఎవరైనా విచారణకు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. అయితే హాజరుకు మినహాయింపు ఇచ్చే అధికారం ట్రయల్ కోర్టుకు ఉంటుందని, అందుకోసం సరైన కారణంతో కేసు విచారణ రోజు అక్కడే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.
కేసు తీవ్రత దృష్ట్యా నిందితుల వ్యక్తిగత హాజరు కోరుతూ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తనకు ఉన్న విచక్షణాధికారం మేరకు తీర్పు ఇచ్చారని...కింది కోర్టులకు ఉండే విచక్షణాధికారంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ఎం.సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫున స్పెషల్ పీపీ కె.సురేందర్ వాదిస్తూ...ఇదే కేసులో నిందితునిగా ఉన్న జగన్ తనకు వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని...దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారని...అయితే హైకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టివేసిందని చెప్పారు.
దీంతో సీబీఐ పీపీ కె.సురేందర్ వాదనతో జస్టిస్ ఎం.సత్యనారాయణ ఏకీభవించారు. ఈ తరహా కేసు విచారణ సమయంలో నిందితుల వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని సీఆర్పీసీ స్పష్టం చేస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్ లో తాను అనేక కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నానని...సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు ప్రతి శుక్రవారం ఢిల్లీ నుంచి రావాల్సి వస్తోందని...దీంతో రెండు రోజులు సమయం బయటే గడపాల్సి వస్తోందని...వ్యాపార సమావేశాల్లో పాల్గొనలేకపోవడంతో పాటు దానివల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం వస్తోందని...అందువల్ల తన తరఫున న్యాయవాది భరద్వాజ్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సిబిఐ..."వ్యాపార సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని కోరడం ఎంత మాత్రం సరైన కారణం కాదు, తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుల వ్యక్తిగత హాజరు తప్పనిసరి. ఈ పిటిషన్ను డిస్మిస్ చేయండి'' అని కౌంటర్లో కోరింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు పునీత్ దాల్మియా పిటిషన్ను కొట్టివేసింది. తాజాగా ఇప్పుడు హైకోర్టులోనూ ఆయనకు నిరాశే ఎదురైంది.