సస్పెండ్: యనమల చిన్న పొరపాటు, సెక్షన్ 340నే రోజాను బ్రతికించిందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని ఉమ్మడి హైకోర్టు గురువారం కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ కోడెల నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది.
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటిస్తూ ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుమారు నాలుగు గంటల పాటు వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనల సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏడాది సస్పెన్షన్: రోజాకు ఊరట, తీర్మానాన్ని కొట్టేసిన హైకోర్టు
అసెంబ్లీ రూల్స్లోని సెక్షన్ 340 ప్రకారం రోజాపై స్పీకర్ ఏడాది పాటు సస్పెన్షన్ వేశారు. వాస్తవానికి సదరు ఆ సెక్షన్ ప్రకారం సభ నుంచి ఒక్క సెషన్కు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంది. కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సెక్షన్ 340 కిందనే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు.
దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు పూర్తి కాకుండానే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యే రోజా వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూ వెంటనే దీనిపై వాదనలు వినాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఈ కేసుకు సంబంధించి బుధవారం వాదనలను వినింది. దీంతో రోజా, అడ్వకేట్ జనరల్ వాదనల విన్న న్యాయమూర్తి బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రోజాను సెక్షన్ 340 ప్రకారం సస్పెండ్ చేసి... ఆ తర్వాత సెక్షన్ను మారుస్తామంటే, ఎలా కుదురుతుందని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సరైన సమాధానం చెప్పకపోవడంతో... న్యాయమూర్తి ఆయన వాదనలు పట్టించుకోకుండా వాదనలు ముగినట్లు ప్రకటించారు.