సీఎం జగన్ సొంత జిల్లాలో 13 గ్రామపంచాయతీల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు స్టే.. రీజన్ ఇదే !!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్ పడింది. కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి.

కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో 206 గ్రామ పంచాయతీలలో నేడు నామినేషన్లు
నేడు కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో 206 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. నేటి నుండి తొలివిడతలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు . ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్లు దాఖలు చెయ్యటానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు .

కడప జిల్లాలో 13 పంచాయతీలను పెంచిన సర్కార్ .. కోర్టుకు వెళ్ళటంతో అక్కడ ఎన్నికలకు స్టే
ఇదిలా ఉంటే ఇటీవల పంచాయతీలను విభజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో 13 పంచాయతీలను పెంచింది. అయితే విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు విభజించిన 13 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది. హైకోర్టుస్టేతో ప్రస్తుతానికి 13 పంచాయతీలకు ఎన్నికల నిలిచిపోయాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వివిధ కారణాలతో 90 పంచాయితీలలో ఎన్నికలు నిలిచి పోయినట్లుగా తెలుస్తుంది.

ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన పంచాయితీ ఎన్నికలు
ఈ ఎన్నికలను అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తుంటే, పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికల్లో సత్తా చాటాలని, అధికార వైసీపీ కి గట్టి షాక్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన , బీజేపీ , వామపక్షాలు , కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications