ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు - ఆన్ లైన్ సినిమా టిక్కెట్లపై హైకోర్టు స్టే..!!
ఏపీలో చాలా కాలం చర్చకు కారణమైన ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం లో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. ఏపీ లో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల నిర్ణయం తీసుకొనే ముందు దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా - పరోక్షంగా విమర్శలు చేసారు. అయితే, ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల అమ్మకాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ విధానం తీసుకొస్తున్నామని వెల్లడించింది.
అందు కోసం ప్రభుత్వ పరిధిలోని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలో నిర్వహించే పోర్టల్ ద్వారా ఈ టిక్కెట్లను అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం పైన అప్పటికే సినీ పెద్దలతో సీఎం జగన్.. నాటి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నిర్వహించిన సమావేశాల్లోనూ ఇండస్ట్రీ నుంచి సూచన వచ్చింది. వారి సూచనల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక, కొద్ది కాలంగా దీనికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..ఎగ్జిబిటర్ల నుంచి ఈ నిర్ణకయం అమల్లో ఉన్న నిబంధనల గురించి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు జూన్ 2న ఏపీ సర్కారు జీవో 69ను జారీ చేసింది. ఈ మేరకు నెల రోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్లకు డబ్బు ఎన్ని రోజుల్లో జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో ఎగ్జిబిటర్లు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 పైన స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అమలు నిలిపేసింది. దీని పైన తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఈ నెల 27న విచారణ జరగనుంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల పైన ఏం చేయబోతోందునేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications