ఫాస్ట్పై టీకి మొట్టికాయ: నేను చెప్పిందే కోర్టూ.. బాబు
హైదరాబాద్: ఫాస్ట్ పథకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసిన విషయం తెలిసిందే. దీని పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి స్పందించారు. విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ పేరిట ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని తాను తొలి నుండి చెబుతూనే వచ్చానని బాబు పేర్కొన్నారు. తాను చెప్పిందే ఇప్పుడు హైకోర్టూ చెప్పిందన్నారు.
ఛత్తీస్గఢ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఆయన ఫాస్ట్ పైన హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు స్పందించారు. తాను తొలి నుండి చెబుతున్నదే హైకోర్టు చెప్పిందని, తెలంగాణలో ఉన్న వారంతా తెలుగువారేనని, అందువల్ల స్థానికత విషయాన్ని సమస్యాత్మకంగా మార్చడం మంచిది కాదన్నారు. సాధారణంగా ఇరు రాష్ట్రాల విద్యార్థుల ఫీజులు 50:50 శాతం పంచుకోవాల్సి వస్తుందని, గొడవలు మంచిది కాదన్న ఉద్దేశ్యంతో తాను 58:42 నిష్పత్తిలో ఫీజులు కట్టడానికి ముందుకొచ్చానన్నారు.
కానీ ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తన పైన అనవసర ఆరోపణలు చేసిందని, మీరు ఆంధ్రావాళ్లకు కట్టక్కర్లేదు, తెలంగాణ స్థానికత ప్రకటించి అందర్నీ సమానంగా చూడాలని కోరానని, హైదరాబాద్ బ్రాండ్ను తానే ప్రోత్సహించానని, అభివృద్ధి అంతా తెలుగుదేశం హయాంలోనే జరిగిందన్నారు. దాని బ్రాండ్ దెబ్బతింటే తెలంగాణ మొత్తం దెబ్బతింటుందని, మొదటి నుండి తాను ఇదే చెబుతూ వచ్చానని, తెలంగాణ ప్రభుత్వం విభిన్నంగా వ్యవహరిస్తూ వచ్చిందన్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వ ఫాస్ట్ పథకం పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మా నిధులు మా ప్రాంతం వారికే అనడం భావ్యం కాదని, ఇక్కడి విద్యార్థులకే బోధన రుసుములు చెల్లిస్తామన్న తెలంగాణ సర్కారు తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఇలాంటి చర్యలు జాతీయ సమగ్రతకు దెబ్బ అని వ్యాఖ్యానించింది.
ఇలాంటి జీవోలను కోర్టులు సమర్థిస్తే ఇతర రాష్ట్రాల వారూ అదే బాట పడతారని వ్యాఖ్యానించింది. రాజ్యాంపరంగా ఎలా సమర్థించుకుంటారని, దీని పైన లోతైన ఆలోచన చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా, సమర్థించుకుంటూ కౌంటర్ వేస్తామని, తెలంగాణ ప్రభుత్వం కోరడంతో విచారణ ఆరువారాలకు వాయిదా పడింది.