శేషాచలం ఎన్కౌంటర్పై విచారణ: ఇంక్వెస్ట్ రిపోర్ట్ సమర్పించాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు మృతుల పోస్టుమార్టం, ఇంక్వెస్ట్ నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కాగా, ఎదురుకాల్పుల విచారణపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఏపి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆ బృందంలోని అధికారుల వివరాలు తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మళ్లీ శవ పరీక్ష కోసం మద్రాసు కోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. విచారణ జరుగుతున్న సందర్భంగా మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ హైకోర్టుకు హాజరయ్యారు.
ఇటీవల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పులు 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. తమపై దాడికి దిగడంతో కాల్పులు జరిపినట్లు ఏపి పోలీసులు పేర్కొన్నారు.
ఎదురుకాల్పుల ఘటనపై తమిళనాడు రాజకీయ పార్టీలు, మానవ హక్కులు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏపికి చెందిన బస్సులపై తమిళనాడులో దాడులు కూడా జరిగాయి. దీంతో కొన్ని రోజులపాటు ఏపి ప్రభుత్వం బస్సులను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ప్రభుత్వం మృతులకు పరిహారం ప్రకటించింది.